గోవు, కొబ్బరికాయ ఎప్పుడు హిందూ మతం పుచ్చుకున్నాయి?: ప్రకాశ్ రాజ్
బెంగళూరు: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గత కొంతకాలంగా రాజకీయాలపై సీరియస్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా బీజేపీ రాజకీయాలను, ప్రధాని మోడీ వైఖరిని ట్విట్టర్ ద్వారా ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు.
Recommended Video
తాజాగా కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మనిషి కన్నా గోవే ముఖ్యమని కొందరు ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.
ఎన్నికల వేళ అసత్య ప్రచారం: కర్ణాటకలో వెబ్సైట్ ఎడిటర్ అరెస్ట్..
మీకు మనుషులు కనిపించడం లేదా?:
రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి, అధికారంలోకి వచ్చిన కొందరు నాయకులు ఆ రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారని, దళితులను శునకాలతో పోల్చుతున్నారని కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తినే ఆహారం గురించి ప్రశ్నించే నాయకులకు మనుషులు కనిపించటం లేదా? అని ప్రశ్నించారు.
ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోని మనుషుల్ని జీవన్మృతులుగా భావించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. జర్నలిస్టులు సైతం ప్రశ్నించే తత్వాన్ని మరిచిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు.
ఆ సినిమా డైలాగ్పై అభ్యంతరం:
కన్నడ నటుడు చిరంజీవి సర్జా నటించిన సీజర్ చిత్రంలో గోహత్యపై ఉన్న సంభాషణలు తీవ్ర ఆక్షేపణీయమని ప్రకాశ్ రాష్ అన్నారు. 'గోహత్య చేసేవారు తల్లి తల నరికిన వారితో సమానం' అన్న ఆ సినిమాలోని డైలాగ్ను ఆయన ఆక్షేపించారు.
తాను ఎక్కడికెళ్లినా కొందరు మతఛాందసవాదులు ఆవు పేడతో కళ్లాపి చల్లి, గోమూత్రంతో శుద్ధి చేస్తున్నారని మండిపడ్డారు. గోవు, కొబ్బరికాయ ఎప్పుడు హిందూ మతం పుచ్చుకున్నాయి?, ఖర్జూరం, గొర్రె ఎప్పుడు ఇస్లాంలోకి వచ్చి చేరాయి? పసుపు, కాషాయ వర్ణాలది ఏ జాతి? అని ప్రశ్నించారు.
ప్రశ్నించడం ఆగదు..:
తాను ఏ పార్టీకి చెందిన నాయకుడిని కాదని, అణగారిన వర్గాలకు మాత్రమే మద్దతుగా నిలుస్తానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని, తప్పుడు సందేశాలిచ్చే బీజేపీ నేతలను ప్రశ్నించేందుకు ఇప్పటికే 2500మందితో ఒక టీమ్ను సిద్దం చేసుకున్నానని తెలిపారు.
'పోస్ట్ కార్డ్'పై ప్రకాశ్ రాజ్ కేసు:
తన ప్రతిష్టను దెబ్బతీసేలా అభ్యంతరకర రీతిలో తనపై కథనాలు రాస్తోందని పోస్ట్కార్డ్ అనే వెబ్ పోర్టల్పై ప్రకాశ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం బెంగళూరులోని కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు.
ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాతే తనపై అభ్యంతరకర కథనాలు మొదలుపెట్టారని ప్రకాశ్ రాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు.
కాగా, కొద్దిరోజుల క్రితం మత కలహాలను రెచ్చగొట్టే విధంగా ఓ తప్పుడు వార్తా కథనాన్ని ప్రచురించినందుకు పోస్ట్ కార్డ్ ఎడిటర్ మహేష్ విక్రమ్ హెగ్దేను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.