కారత్ వ్యాఖ్యలకు సుబ్రహ్మణ్య స్వామి ఘాటు కౌంటర్, హైదరాబాద్కు వరవరరావు
న్యూఢిల్లీ: భీమా కోరేగావ్ ఘటన కేసులో పుణే పోలీసులు పలువురు నేతల ఇళ్లలో సోదాలు చేయడంపై కొన్ని పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా స్పందించారు. ఆయనను అలాగే అరవనీయండని, అదేం పెద్ద విషయం కాదన్నారు.
వీరు అందరూ ఇలాగే మాట్లాడుతారని, ప్రజాస్వామ్యాన్ని మాత్రం పాటించరని, ఆ కుట్ర గురించి సమాచారం అందడం వల్లే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ విషయం కోర్టు వద్దకు వెళ్తుందన్నారు. ప్రభుత్వం చేసింది తప్పని భావించేవారు తమ లాయర్లతో కోర్టులో తేల్చుకోవాలన్నారు. ప్రజాస్వామ్య విధానాలు ఇలాగే ఉంటాయని, ప్రజాస్వామ్యం ఎలా పని చేస్తోందనే విషయం కొందరు అర్థం చేసుకోలేరన్నారు.
మహారాష్ట్రలోని భీమా కోరెగావ్ గ్రామంలో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించిన కేసులో భాగంగా మంగళవారం ముంబై, రాంచీ, హైదరాబాద్, ఫరీదాబాద్, ఢిల్లీ, థానే నగరాల్లోని పలువురి ఇళ్లలో పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నుతున్నారని, అలాగే మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై విరసం నేత వరవరరావు, మానవ హక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖా, పౌర హక్కుల నాయకురాలు సుధా భరద్వాజ్తో పాటు అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గొంజాల్వెస్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ అరెస్టులపై ప్రకాశ్ కారత్ మాట్లాడుతూ.. ఈ చర్యలు ప్రజాస్వామ్య హక్కులపై దాడులు చేయడమని, వారిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకొని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు.
వరవరరావును తిరిగి హైదరాబాద్ తీసుకువస్తున్న పోలీసులు
పోలీసులు వరవరరావును తిరిగి హైదరాబాద్ తీసుకు వస్తున్నారు. ఆయనను పుణే పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వరవరరావు సహా దేశవ్యాప్తంగా ఐదుగురిని హౌస్ అరెస్ట్ చేసి విచారించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు తిరిగి ఆయనను హైదరాబాద్ తెస్తున్నారు.