మోడీ కర్ణాటక ర్యాలీ: ప్రకాష్ రాజ్ ప్రామిస్ టూత్ పేస్ట్ ట్వీట్
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక ర్యాలీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన వ్యాఖ్యలు చేశారు.
2014లో విక్రయించిన ప్రామిస్ టూత్ పేస్ట్ రైతులు, నిరుద్యోగ యువత ముఖాలపై నవ్వులు పూయించడంలో విఫలమైందని ఆయన మోడీ ప్రభుత్వంపై వ్యాఖ్యానించారు. బెంగళూర్ ర్యాలీలో అమ్మిన ప్రామిస్ టూత్ పేస్టు ఆ నవ్వులను తీసుకొస్తాయని మీరు నమ్ముతున్నారా అని అడిగారు.
ప్రధాని మోడీ కర్ణాటక ర్యాలీలో చేసిన హామీలు అమలవుతాయని మీరు నమ్ముతున్నారా అని ఆయన కర్ణాటక ప్రజలను ప్రశ్నించారు. తన బెంగళూర్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెసు పార్టీపై తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.
సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లించి అవినీతికి పాల్పడుతోందని ఆయన అన్నారు. కర్ణాటక అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని, బెంగళూరు మెట్రోకు ర.17 వేల కోట్లు కేటాయించామని ప్రధాని చెప్పారు. కర్ణాటక రూపురేఖలు మార్చేది బిజెపి మాత్రమేనని ఆయన అన్నారు.