కరోనా విషయంలో కాస్త డిఫరెంట్ గా ఆలోచించిన ప్రకాష్ రాజ్: ఏం చేశారంటే
కరోనా ఇప్పుడు ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది . కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ప్రపంచమే ఇప్పుడు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అయ్యి నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి . ఇక ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావొద్దని కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. అయితే, ఇది దినసరి కూలీలకు, కొందరు ఉద్యోగులకు కూడా తీవ్ర కష్టాలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా జాగ్రత్తల మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ విలక్షణ నటుడు, పొలిటీషియన్ ప్రకాష్ రాజ్ విభిన్నంగా స్పందించారు.
కరోనా విషయంలో ప్రకాష్ రాజ్ స్పందన
రెక్కాడితే గానీ, డొక్కాడని వారి పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న . అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు సరుకుల కోసం కొంత సాయం కూడా చేసేందుకు సిద్ధమైంది. ఇక ఈ సమయంలో సామాన్య దినసరి కూలీల గురించి ఆలోచించిన ప్రకాష్ రాజ్ జనతా కర్ఫ్యూ, షట్డౌన్ ప్రకటించిన వేళ సోషల్ మీడియాలో తాను ఎలా నడుచుకుంటున్నాను, ప్రజలు ఏం చేస్తే బాగుటుందనే విషయాలపై స్పందించారు ప్రకాష్ రాజ్. ఇక చాలా మంది ప్రముఖులకు కరోనా జాగ్రత్తలపై సందేశాలు ఇవ్వటమే కాదు చేతనైన సాయం చెయ్యాలని కూడా పిలుపునిచ్చారు.
తన దగ్గర పని చేసే సిబ్బందికి మే వరకు జీతాలు ఇచ్చేసిన ప్రకాష్ రాజ్
ఇక ప్రకాష్ రాజ్ తాను తాజా పరిణామాల నేపధ్యంలో కరోనా వైరస్ పై పోరాటానికి దేశం లాక్ డౌన్ ప్రకటిస్తున్న వేళ ఒక ట్వీట్ చేశారు. ఇక ట్వీట్ విషయానికి వస్తే.. ‘జనతా కర్ఫ్యూ'తో తన నగదు నిల్వను ఒకసారి చూసుకున్నాను. తన ఇంట్లో, ఫార్మ్ హౌస్లో, ఫిల్మ్ ప్రొడక్షన్ మరియు ఫౌండేషన్లో ఉద్యోగం చేసేవారికీ, నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశానని ప్రకటించారు .
దినసరి వేతనం తీసుకునే సినీ కార్మికులకు ఆర్ధిక చేయూత
ఇక అంతే కాదు తాను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబంధించి దినసరి వేతనం తీసుకొనే కార్మికుల గురించి ఆలోచించానని పేర్కొన్న ప్రకాష్ రాజ్ కరోనా మహమ్మారితో పాటిస్తున్న సోషల్ డిస్టెన్సింగ్ మూలంగా షూటింగ్స్ నిలిచిపోయాయని , ఇక అందుకే తన సినిమాల కోసం పని చేసే ఆ దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించానని పేర్కొన్నారు . ఇక్కడితో పూర్తి కాదు నా శక్తి మేరకు సాయం చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు ప్రకాష్ రాజ్ .
మీ చుట్టుపక్కల అవసరం అయిన వారికి సాయం చెయ్యమన్న ప్రకాష్ రాజ్
ప్రతి ఒక్కరు తమ శక్తి మేరకు సాయం చెయ్యాలని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ప్రజలందరికీ కొన్ని సూచనలు చేశారు. మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే.. మీ చుట్టూ ఒకసారి చూడండి. మీ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. ఒకరి జీవనాన్ని, జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు . మొత్తానికి చాలా మంది సెలబ్రిటీలు కరోనా జాగ్రత్తలకే పరిమితం అయితే ప్రకాష్ రాజ్ మాత్రం సామాజిక బాధ్యత గా సామాన్యులకు సాయం చెయ్యాలని , ఈ విపత్తు సమయంలో ఆదుకోవాలని కోరుతున్నారు.