మనోహర్ పారిక్కర్ వారసుడు ఖరారు: త్వరలో అధికారిక ప్రకటన
పనాజీ: గోవా ముఖ్యమంత్రిగా డాక్టర్ ప్రమోద్ సావంత్ పేరును భారతీయ జనతాపార్టీ అధిష్ఠానం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మనోహర్ పారిక్కర్ కన్నుమూత వల్ల ఖాళీ అయిన ముఖ్యమంత్రి స్థానాన్ని ప్రమోద్ సావంత్ తో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు బీజేపీ గోవా శాఖ నాయకులు సూత్రప్రాయంగా తెలియజేశారు. ప్రస్తుతం ప్రమోద్ సావంత్.. గోవా అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. తొలుత- ప్రమోద్ సావంత్ తో పాటు విశ్వజిత్ రాణే పేరును కూడా బీజేపీ అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకుంది.
కిస్సా కుర్చీకా : గోవా సీఎం క్యాండెట్ పై బీజేపీ మంతనాలు, తెరపైకి ఎంజీపీ నేత సుదీన్ అభ్యర్థితం ?
ఈ రెండు పేర్లపై బీజేపీ నాయకుల సమక్షంలో ఉంచింది. దీనిపై పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరం, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రమోద్ సావంత్ పేరును ఖాయం చేసినట్లు చెబుతున్నారు. ఆయన పేరును సోమవారం సాయంత్రమే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఆయన శాన్ క్వెల్లియమ్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వృత్తిపరంగా ఆయన ఆయుర్వేద వైద్యుడు.
మనోహర్ పారిక్కర్ వారసుడిని ఎంపిక చేయడానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం రాత్రి పొద్దు పోయేంత వరకూ బీజేపీ నాయకులతో చర్చించారు. అయినప్పటికీ.. ఏకాభిప్రాయం రాలేదు. దీనితో పార్టీ అగ్ర నాయకులు రంగంలోకి దిగారు. కూడికలు, తీసివేతలు, వడపోతల తరువాత విశ్వజిత్ రాణే, ప్రమోద్ సావంత్ ల పేర్లను తెర మీదికి తీసుకొచ్చారు. మెజారిటీ సభ్యులు ప్రమోద్ పేరును ఖాయం చేశారని, దీనితో పార్టీ నాయకత్వం కూడా ఆయన వైపే మొగ్గు చూపిందని అంటున్నారు.