రాష్ట్రపతి పాలనకు, టి బిల్లుకు ప్రణబ్ ఆమోదం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లుకు (తెలంగాణ బిల్లుకు) కూడా ఆయన ఆమోద ముద్ర వేశారు. శాసనసభను సుప్త చేతనావస్థలో ఉంచి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ మార్చి 1వ తేదీని నోటిఫైడ్ డేట్గా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సంబంధించి వెంటనే గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి గెజిట్ నోట్ గవర్నర్కు అందగానే రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుంది.
కాగా, తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో అపాయింటెడ్ డేను ప్రటించాల్సి ఉంటుంది. అపాయింటెడ్ డే నిర్ణయించడానికి కనీసం 8 నుంచి పది పని దినాలు కావాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే, అందుకు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని హోం శాఖ మంత్రిత్వ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుత స్థితిలో ఉమ్మడి రాష్ట్రంలోనే వచ్చే లోకసభ, శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావ తేదీని నిర్ణయానికి సమయం పట్టే అవకాశం ఉండడం వల్ల, త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగవచ్చునని అంటున్నారు.