వెంటిలేటర్ పై ప్రణబ్ ముఖర్జీ - ఆర్మీ ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ - డాక్టర్లు ఏమన్నారంటే..
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి(ఆర్ఆర్ హాస్పిటల్)లో సోమవారం ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. మెదడులో ఏర్పడ్డ క్లాట్స్ ను డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. అయితే ఆపరేషన్ పూర్తయిన తర్వాత, రాత్రి నాటికి ప్రణబ్ పరిస్థితి క్రిటికల్ గా ఉందని, వెంటిలేటర్ సపోర్టును అందించామని డాక్టర్లు చెప్పినట్లు ప్రఖ్యాత వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
బ్రెయిన్ సర్జరీకి ముందు నిర్వహించిన టెస్టుల్లో పణబ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ''వేరే పని కోసం ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకోగా, కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. గడిచిన వారం రోజులుగా నాకు సన్నిహితంగా మెదిలినవాళ్లంతా దయచేసి ఐసోలేషన్ లోకి వెళ్లి టెస్టులు చేయించుకోండి''అని ప్రణబ్ పేర్కొన్నారు. అయితే, ఆయన చెప్పిన వేరే పని 'బ్రెయిన్ సర్జరీ'అన్న విషయం ఆలస్యంగా వెల్లడైంది.
Recommended Video
వెంటిలేటర్ పై చికిత్స పొందుతోన్న ప్రణబ్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. ప్రణబ్ కూతురు శర్మిష్టకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సోమవారం సాయంత్రం ఆర్ఆర్ ఆస్పత్రికి వెళ్లి మాజీ రాష్ట్రపతిని పరామర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు ప్రణబ్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు.