విషమంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి .. వెంటిలేటర్ పై మాజీ రాష్ట్రపతి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది . ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై ఉన్నట్లుగా తెలుస్తోంది. సోమవారం నాడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బ్రెయిన్ సర్జరీ చేశారు. మెదడులో ఒక చోట రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంతో అత్యవసర పరిస్థితి నేపధ్యంలో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు వైద్యులు. ఈ ఆపరేషన్ క్రమంలోనే ప్రణబ్ ముఖర్జీ కరోనా బారిన పడినట్లుగా నిర్ధారణ అయింది.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనీ వదల్లేదు: పాజిటివ్ రిపోర్ట్: కరోనా బారిన హైప్రొఫైల్
శస్త్ర చికిత్స నిర్వహించే ముందు జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పటల్ లో ప్రణబ్ ముఖర్జీకి బ్రెయిన్ క్లాట్ తొలగించేందుకు శస్త్రచికిత్స జరిగింది. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు గా తెలుస్తోంది. ఇక తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఆయన ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లుగానే వైద్యులు పేర్కొన్నారు.
తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో వారం రోజుల్లో తనను కలిసిన వారు సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్ళాలని , కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే . ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో పాటు , ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ,దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రణబ్ ఆరోగ్యం గురించి ఆయన కుమార్తె శర్మిష్ట కి ఫోన్ చేసి అడిగి తెలుసుకుంటున్నారు.
ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ నేత . దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అశోక్ గెహ్లాట్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 2012 - 2017 మధ్యకాలంలో ప్రణబ్ ముఖర్జీ భారతదేశం రాష్ట్రపతిగా వ్యవహరించారు.