ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం
నాగ్పూర్: పూర్వకాలం నుంచి భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అనేకమంది యాత్రికులు భారతీయ చరిత్రను ప్రపంచానికి చాటారని తెలిపారు. నలంద, తక్షశిల లాంటి ప్రతిష్టాత్మక విద్యాలయాలతో విలసిల్లిందని చెప్పారు.
జాతీయత, దేశ భక్తి అనే భావనలపై అభిప్రాయాన్ని పంచుకోవడానికి వచ్చానని తెలిపారు. వసుదైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు భావనను కలిగి ఉండాలన్నారు. వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని గౌరవించాలన్నారు.
#WATCH Former President Dr Pranab Mukherjee speaking at RSS's Tritiya Varsh event, in Nagpur https://t.co/REkQkhbYLG
— ANI (@ANI) June 7, 2018
' బుద్ధిజం ఆసియా దేశాలకు వ్యాప్తి చెందింది. మనదేశం అనేకమంది రాజుల పాలనలో కొనసాగింది. ఆ తర్వాత ముస్లిం రాజులు మనదేశంలోకి చొరబడి వారి పాలనను కొనసాగించారు. అనంతరం బ్రిటీషువారు వ్యాపారం పేరుతో వచ్చి దేశాన్ని ఆక్రమించుకుని పాలన కొనసాగించారు. అనేక పోరాటాల తర్వాత మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది ' అని ప్రణబ్ తెలిపారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సంస్థానాలను విలీనం చేసి దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ చొరవ అనిర్వచనీయమని అన్నారు. బహుళత్వాన్ని అలవర్చుకునే గుణం మన జీవన విధానంలోనే ఉందన్నారు. ఐరోపా కంటే ముందే మన దేశంలో జాతి, జాతీయ భావన ఉందని చెప్పారు. మనదేశం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
అసహనం, ఆందోళన అన్నవి మన జాతీయ భావనను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1857 తర్వాత భారత్లో తొలిసారి కేబినెట్ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. తొలిసారి సెక్రటరీ ఆఫ్ స్టేట్ను నియమించారని తెలిపారు. ఈ దేశం, జాతీయత ఒక కులం, మతం, వర్గానిది కాదన్నారు. జాతీయ భావన అనేది మతాలకు అతీతంగా వస్తుందని అన్నారు. భారత రాజ్యాంగం నిర్వహణకు గైడ్ కాదని.. వంద కోట్ల మంది ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపమన్నారు.
విభిన్నమైన సంస్కృతులు భారత్ను ఏకం చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి విషయంలో ప్రజల పాత్ర ఉండాలన్నారు. ఇటీవల కాలంలో హింస పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. మనం శాంతి సామరస్యాల కో్సం పనిచేయాలన్నారు. మన మాతృదేశం ఇదే కోరుకుంటోందన్నారు. కౌటిల్యుడి మాటల ప్రకారం ప్రజల సంతోషమే పాలకులకు సంతోషమన్నారు.
మనది భిన్నత్వంలో ఏకత్వం, ప్రణబ్తో మంచి స్నేహం: మోహన్ భగవత్
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తమకు మంచి స్నేహం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్కు ప్రముఖులను ఆహ్వానించే సాంప్రదాయం ఉంది. అందుకే ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించాం.. ఆయన అంగీకరించారని చెప్పారు. ఎందుకు పిలిచారు? ఎందుకు వెళ్లారు? అన్న చర్చ అనవసరం అన్నారు.
ఆర్ఆర్ఎస్.. ఆర్ఎస్ఎస్సే.. ప్రణబ్ ముఖర్జీ.. ప్రణబ్ ముఖర్జేనని అన్నారు. ప్రణబ్ తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మన సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వమని అన్నారు. మనమంతా భారతమాత సంతానమని అన్నారు. భారతదేశంలో పుట్టిన ప్రతీ ఒక్కరూ భారతీయులేనని అన్నారు. మనలోని సంకుచిత భావాన్ని విడనాడాలని అన్నారు.
భిన్నత్వంలో ఏకత్వమనేది మన సిద్ధాంతమని, కొందరికి అది అర్థం కావడం లేదని మోహన్ భగవత్ అన్నారు. అందరికీ మాత భారతమాత అన్నారు. భారతదేశం అనేక భాషలు, సంస్కృతుల సమ్మేళనం అని అన్నారు. ప్రభుత్వం ఒక్కటే అన్నీ చేయలేదని, ప్రజల భాగస్వామ్యం అవసరమని.. అప్పుడే మార్పు వస్తుందని అన్నారు. రాజకీయ వైరుధ్యాలున్నా.. దేశ అభివృద్ధే మన లక్ష్యమని అన్నారు.
విశ్వగురువుగా భారతదేశాన్ని చూడాలని అన్నారు. హెడ్గేవార్ ఆలోచనలన్నీ దేశం విముక్తి చుట్టే ఉండేవని చెప్పారు. భారతదేశం అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు.
హెడ్గేవార్కు ప్రణబ్ ముఖర్జీ నివాళి
రాష్ట్రీయ స్వయం సంఘ్(ఆర్ఎస్ఎస్) తృతీయ శిక్షా వర్గ్ ముగింపు కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. మోహన్ భగవత్తోపాటు ఆరెస్సెస్ ప్రధాన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరాం హెడ్గేవార్ జన్మస్థలాన్ని సందర్శించి నివాళుర్పించారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక సర్ సంఘ్ చాలక్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ జన్మస్థలాన్ని సందర్శించారు. నాగపూర్లోని హెడ్గేవార్ స్మారక కేంద్రాన్ని సందర్శించిన ఆయన విజిటర్స్ బుక్లో ఆసక్తికరమైన సందేశాన్ని రాశారు. భారతమాత కన్న గొప్ప బిడ్డ కేబీ హెడ్గేవార్ అని ఆయన అభివర్ణించారు. 'భారతమాత కన్న గొప్ప బిడ్డకు నివాళులర్పించేందుకు ఇక్కడికి వచ్చాను' అని ప్రణబ్ విజిటర్స్ బుక్లో రాశారు.