షా కొడుకు పెళ్లికే రాలేదు: కేజ్రీవాల్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోని మోడీ!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షాక్ నుండి ప్రధాని నరేంద్ర మోడీ తేరుకున్నట్లుగా కనిపించడం లేదు! బుధవారం రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సమావేశం సందర్భంగా మోడీ కళతప్పిన వదనంతో కనిపించారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ప్రభుత్వ విధానాల గురించి ప్రధాని వివరిస్తుంటారు. అయితే, బుధవారం మోడీ ఎలాంటి ప్రసంగం చేయలేదు. అంతేకాదు, కనీసం గవర్నర్లతో పిచ్చాపాటీగా కూడా మాట్లాడలేదు.
సమావేశంలో దాదాపు 30 నిమిషాలు గడిపిన ఆయన ఉన్నంతసేపూ ముభావంగా కనిపించారు. అటుపైన గవర్నర్లతో లాంఛనంగా ఫొటో దిగి వెళ్లిపోయారు. ఆయన ముఖంలో కళతప్పిందని, ఢిల్లీ ఎన్నికల్లో తీవ్ర పరాజయంతో బాగా కుంగిపోయినట్లు కనిపించారని ఒక గవర్నర్ వ్యాఖ్యానించారు. అలాగే రోజూ కనీసం నాలుగైదు కార్యక్రమాల్లో పాల్గొనే మోడీ బుధవారం దీనదయాళ్ జయంతి సందర్భంగా ఒక ట్వీట్ మాత్రం చేశారు.
మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశం యథాప్రకారం సాగినా ప్రధానాంశాలపై చర్చలేవీ జరగలేదు. ఆ తర్వాత మాత్రం మోడీ సీనియర్ మంత్రులతో గంటన్నరసేపు మాట్లాడారు. ఈ మేరకు అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, అనంత్ కుమార్, వెంకయ్య నాయుడు, తవార్ చంద్ గెహ్లాట్లతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు.
ఎన్నికల వ్యూహరచన, కిరణ్ బేదీని రంగంలో దింపడం, ఏఏపీ శక్తిని అంచనా వేయడంలో పొరపాట్లు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చినందువల్లే ఓడిపోయామని ఓ మంత్రి చెప్పారని తెలుస్తోంది. కేజ్రీవాల్తో సత్సంబంధాలు నెరపడమే మంచిదని సీనియర్లు అభిప్రాయపడినట్లుగా చెబుతున్నారు.
ఈ ఓటమి నేపథ్యంలో బడ్జెట్లో మార్పుచేర్పులు, పార్లమెంటు సమావేశాల వ్యూహరచన, గురించి వారు చర్చించినట్లు తెలిసింది. బీహార్ పరిణామాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఈ సమావేశంలోనూ ప్రధాని ఎక్కువ సేపు ముభావంగా ఉన్నారని తెలుస్తోంది.
ఆయన చాలా సీరియస్గా కనిపించారని, మంగళవారం తన ఆప్తమిత్రుడు, పార్టీ అధ్యక్షుడు అమిత్షా కుమారుడి వివాహానికి కూడా హాజరు కాలేదంటే ఈ ఫలితాలు ఆయనకెంత దిగ్ర్భాంతి కలిగించాయో అర్థమవుతోందని ఓ బీజేపీ సీనియర్ నేత అన్నారు.
అలాగే, అమిత్ షా ఇంట్లో పెళ్లికి హాజరైన వారి ముఖాల్లో కూడా కళలేదని, బాణాసంచా పేల్చడంవంటి ఆర్భాటాలు లేకుండా చూశారని చెప్పారు. కాగా, మతశాంతి కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్లకు రాష్ట్రపతి ప్రణబ్ సూచించారు.