ప్రశాంత్ భూషణ్ మరో ట్విస్ట్.. రూపాయి విరాళంగా ఇచ్చిన సహచరుడు రాజీవ్ ధావన్..
సుప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసు వ్యవహారం ట్విస్ట్ మీద ట్విస్ట్గా సాగుతోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అనుచిత ట్వీట్ల వ్యవహారంలో కోర్టు కానీ, ప్రశాంత్ భూషణ్ కానీ ఎక్కడా వెనక్కి తగ్గకపోవడంతో నెలకొన్న ప్రతిష్టంభనకు ఇవాళ అత్యున్నత న్యాయస్ధానం రూపాయి జరిమానాతో తెరదించే ప్రయత్నం చేసింది. కోర్టుకు క్షమాపణ చెబితే చాలు కేసు కొట్టేస్తామని న్యాయమూర్తులు పదే పదే సూచించినా ఏమాత్రం వెనక్కి తగ్గని ప్రశాంత్ భూషణ్ తనకు విధించిన జరిమానా విషయంలోనూ మరో ట్విస్ట్ ఇచ్చారు.
ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసులో రూపాయి జరిమానా చెల్లించాలని లేకుంటే మూడు నెలలు జైల్లో ఉండాలని, ఈ సమయంలో ఆయన న్యాయవాద లైసెన్స్ను కూడా రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ఇవాళ హెచ్చరికలు చేసింది. అయితే ఆయన రూపాయి చెల్లిస్తారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతుండగానే కోర్టు హాలు నుంచి బయటికి వచ్చిన ప్రశాంత్ భూషణ్కు ఆయన సహచర సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ రూపాయి తాను విరాళంగా ఇస్తానని ముందుకొచ్చారు. దీంతో సుప్రీంకోర్టులో ఇన్ని రోజులుగా తన పట్టు కొనసాగించిన ప్రశాంత్ భూషణ్.. తన సహచరుడి ప్రతిపాదనను మాత్రం కాదనలేకపోయారు.
రాజీవ్ ధావన్ నుంచి రూపాయి విరాళంగా స్వీకరించినట్లు ప్రశాంత్ భూషణ్ వెల్లడించారు. దీంతో ఈ రూపాయి జరిమానాగా చెల్లించడం ఖాయమైనట్లయింది. సుప్రీంకోర్టు ప్రతిష్ట, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని రూపాయి జరిమానా చెల్లించి ఈ వివాదానికి ముగింపు పలకాలని ప్రశాంత్ భూషణ్కు ఆయన సన్నిహితుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు చెల్లించాల్సిన రూపాయిని విరాళంగా స్వీకరించినట్లు సమాచారం. అయితే కేసులో రూపాయి జరిమానా చెల్లిస్తానని, కానీ తనకు విధించిన శిక్షను కొట్టేయాలని దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ మాత్రం కొనసాగుతుందని ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు.