ముఖ్యమంత్రిని బహిరంగంగా నిలదీసిన ప్రశాంత్ కిశోర్: బహిష్కరించిన నితీష్..!
పాట్నా: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం అటు తిరిగి, ఇటు తిరిగి జనతాదళ్ (యునైటెడ్)లో చిచ్చు పెట్టింది. పార్టీ రాజకీయ వ్యూహకర్త, సీనియర్ నాయకుడు ప్రశాంత్ కిశోర్ను బహిష్కరించడానికి కారణమైంది. ప్రశాంత్ కిశోర్తో పాటు ఆయనకు వత్తాసు పలికిన పవన్ వర్మను కూడా సాగనింపింది పార్టీ అగ్ర నాయకత్వం. ఈ మేరకు జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రశాంత్ కిశోర్ వర్సెస్ నితీశ్: అబద్దాలు చెప్తున్నారు, అమిత్ షాకు చెప్పాల్సింది, ధైర్యం లేదా..?
పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయాలనే అంశాన్ని ప్రశాంత్ కిశోర్ ముందు నుంచీ వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయాలను ఆయన పలు సందర్భాల్లో వ్యతిరేకించారు. బహిరంగంగా తన నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. పౌరసత్వ సవరణ చట్టంపై జనతాదళ్ (యునైటెడ్) ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని తీసుకోక ముందే.. ప్రశాంత్ కిశోర్ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసే విషయంలో నితీష్ కుమార్ ముందు నుంచీ రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తున్నారని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ప్రశాంత్ కిశోర్ విమర్శించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నితీష్ కుమార్ నిజం మాట్లాడినప్పటికీ.. ఎవరూ విశ్వసించ బోరనీ అన్నారు. తనను ఏ ఉద్దేశంతో జేడీయూలోకి ఆహ్వానించారో ఇప్పటికీ అర్థం కావట్లేదనీ చెప్పారు ప్రశాంత్ కిశోర్. నితీష్ కుమార్ తాను పూసుకున్న కాషాయరంగును తనకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యల పట్ల జేడీయూ సీనియర్ నాయకులు తీవ్రంగా స్పందించారు. నితీష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ క్రమశిక్షణ విభాగం నియమాలను ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. ఎలాంటి షోకాజ్ నోటీసులను కూడా జారీ చేయకుండా.. ప్రశాంత్ కిశోర్పై వేటు వేశారు. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది జేడీయూ. తనపై వేటు వేయడాన్ని ప్రశాంత్ కిశోర్ స్వాగతించారు. థ్యాంక్యూ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.