ప్రశాంత్ కిషోర్కు భారీ షాక్.. జేడీయూ నుంచి గెంటివేతకు రంగం.. నితీశ్ సీరియస్ వార్నింగ్
తన చతురాత్మక వ్యూహాలతో ఎన్నో రాజకీయ పార్టీలకు ప్రాణంపోసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సొంత పార్టీ జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) నుంచే గెంటివేతకు రంగం దాదాపు సిద్ధమైంది. సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలపై పార్టీ లైన్ కు విరుద్ధంగా కామెంట్లు చేయడంతోపాటు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోన్న పీకేతీరును జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు.
అంతా రివర్స్
కేంద్రంలోని ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతోన్న జేడీయూ.. ఎన్ఆర్సీ చట్టాన్ని బిహార్ లో అమలు చేయాల్సిందేనని ఇదివరకే స్పష్టం చేసింది. సీఏఏపై కొన్ని అనుమానాలున్నా అమలును మాత్రం అడ్డుకోబోమని జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ స్పష్టం చేశారు. పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతోన్న ప్రశాంత్ కిషోర్ మాత్రం.. నితీశ్ కు పూర్తి రివర్స్ లో ప్రకటనలు చేస్తున్నారు. సీఏఏ నిరసనల్ని హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో నితీశ్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పోతే పో.. ఉంటే ఉండు..
జేడీయూ పార్టీ విధానాలకు విరుద్ధంగా ప్రశాంత్ కిషోర్ చేస్తోన్న ప్రకటనలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం నితీశ్ బదులిచ్చారు. మంగళవారం పాట్నాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘పార్టీలో ఉన్నవాళ్లందరూ లైన్ కు కట్టుబడి ఉండాల్సిందే. విధానాలు నచ్చకపోతే ఇక వారి ఇష్టం. పార్టీ నుంచి పోవాలనుకుంటే పోవచ్చు.. ఉండాలనుకుంటే ఉండొచ్చు..''అని పీకేను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వెంటనే స్పందించిన పీకే
‘పార్టీలో ఉండాలనుకుంటే ఉండు లేకపోతే లేదు' అంటూ నితీశ్ కుమార్ చేసిన కామెంట్లకు ప్రశాంత్ కిషోర్ వెంటనే స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన.. తాను బిహార్ వెళ్లిన తర్వాత సీఎంతో మాట్లాడుతానని, ఆ తర్వాతే సమాధానం చెబుతానని, అప్పటిదాకా ఎదరుచూడాలని బదులిచ్చారు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.
అమిత్ షాతో వాదనే కొంపముంచిందా?
సీఏఏ, ఎన్ఆర్సీపై మొదటి నుంచీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ పట్ల జేడీయూ సానుకూలంగానే వ్యవహరించింది. అయితే రెండురోజులుగా జరిగిన పరిణామాలు మొత్తం పార్టీనే ఇరుకున పెట్టాయి. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మాట్లాడుతూ.. ఆప్ మళ్లీ గెలిస్తే.. షాహీన్ బాగ్ లాంటి చౌక్ లు చాలా పుట్టుకొస్తాయని, అందుకే బీజేపీకి ఓటేయాలని కోరారు. దానికి పీకే కౌంటరిస్తూ.. పగతోకాదు ప్రేమతో ఓట్లేయండని పిలుపునిచ్చారు. ఈ వ్యవహారం బీజేపీ, జేడీయూ దోస్తీకి ముప్పుతెచ్చే పరిస్థితులు దాపురించడంతోనే పీకేకు నితీశ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.