బీజేపీకి కౌంటర్: ప్రశాంత్ కిషోర్కు మమతా బెనర్జీ భారీ ఆఫర్!
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్కు పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భారీ ఆఫర్ ప్రకటించింది. ప్రశాంత్ కిషోర్ను తమ పార్టీ నుంచి రాజ్యసభకు పంపిస్తున్నట్లు టీఎంసీ వర్గాలు శనివారం ప్రకటించాయి.
మమత గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్..
ఎగువసభలో తమ పార్టీ, రాష్ట్ర గొంతును బలంగా వినిపించేందుకు కొత్త ముఖాల కోసం మమతా బెనర్జీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల కోసం ఎన్నికల వ్యూహాలను అందించేందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ను నియమించుకున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐపాక్ సంస్థతో టీఎంసీ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది.
మమత పార్టీ నుంచి రాజ్యసభకు నలుగురు..
ప్రస్తుతం తృణమూల్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మనీష్ గుప్తా, జొజెన్ చౌదరి, అహ్మద్ హసన్ ఇమ్రాన్, కేడీ సింగ్లో పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో కొత్త ముఖాలను రాజ్యసభకు పంపాలని టీఎంసీ ప్రయత్నిస్తోంది. మార్చి 26న నాలుగు స్థానాలతోపాటు మరో సీపీఐ(ఎం)కు చెందిన మరో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
అనుకున్నట్లు జరిగితే రాజ్యసభలో ప్రశాంత్ కిషోర్..
ప్రస్తుత దేశ పరిస్థితుల్లో పార్టీ గొంతును బలంగా వినిపించే యువనాయకులను ఎగువసభకు పంపించాలనే తమ పార్టీ అధినేత్రి ఉద్దేశమని టీఎంసీ నేతలు తెలిపారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ తోపాటు దినేష్ త్రివేది, మౌసమ్ నూర్ వంటి వారిని రాజ్యసభకు పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ రాజ్యసభ ఎంట్రీ ఖరారైనట్లేనని తెలుస్తోంది.