అప్పుడు జగన్.. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్: ‘గెలుపు’ మంత్ర ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజార్టీని సాధించింది. దీంతో ఢిల్లీ పీఠంపై ముచ్చటగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ ఆసీనులు కానున్నారు. ఢిల్లీ గద్దెనెక్కాలని తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీకి మాత్రం ఆశించిన ఫలితం కూడా దక్కలేదు.
కేజ్రీవాల్ గెలుపులో ప్రశాంత్ కిషోర్...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మేనిఫెస్టో కీలక పాత్ర పోషించగా.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆప్ గెలుపును ఖరారు చేయడంలో కీలక భూమికను పోషించారు. ఎన్నికల ప్రచారంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ఆప్ మేనిఫెస్టో రూపకల్పనలోనూ ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నట్లు తెలిసింది. ఆయన వ్యూహాలు ఫలించడంతో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి భారీ విజయం సాధించారు.
ఏపీలో జగన్ అధికారంలోకి... ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, జగన్ విజయంలోనూ ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. జగన్. ఎన్నికల ముందే తన రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించుకున్నారు. బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి కూడా జగన్ పార్టీ విజయం కోసం ప్రశాంత్ కిషోర్ అహర్నిశలు కృషి చేశారు. ‘రావాలి జగన్.. కావాలి జగన్' అనే నినాదాలు, మేనిఫెస్టో రూపకల్పనలోనూ తన ముద్రను వేసి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్నందించారు ప్రశాంత్ కిషోర్.
కేజ్రీవాల్ను మళ్లీ ఢిల్లీ పీఠమెక్కించిన ప్రశాంత్ కిషోర్..
తాజాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ను భారీ మెజార్టీతో గెలిపించి ప్రశాంత్ కిశోర్ మరోసారి తన సత్తాను చాటారు. ఎలాగైనా అధికారం చేపట్టాలని కసితో ఉన్న బీజేపీకి ఆయన వ్యూహాలు చెక్ పెట్టాయి. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని 7కు 7 లోక్సభ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వెనుకబడి పోయింది. అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలకు తోడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు తోడవడంతో ఢిల్లీ పీఠంపై ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి జెండా ఎగురవేసింది.
ప్రశాంత్ కిషోర్ సూచనలు, వ్యాహాలే శ్రీరామ రక్షగా
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయానం సహా అనేక అంశాల్లో అరవింద్ కేజ్రీవాల్ కు ప్రశాంత్ కిశోర్ సలహాలు ఇచ్చారు. జాతీయ అంశాలపై కాకుండా రాష్ట్ర అంశాలపైనే దృష్టి సారించాలని అరవింద్ కేజ్రీవాల్కు ప్రశాంత్ కిషోర్ గట్టిగా చెప్పారట. ఆయన చెప్పినట్లే అరవింద్ కేజ్రీవాల్ కూడా తన గెలుపుకోసం ప్రయత్నించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పారడంతో ఢిల్లీ పీఠంపై మరోసారి చీపురుపార్టీ కూర్చోనుంది.
నెక్స్ట్ తమిళనాడు.. డీఎంకే గెలుపు కోసం..
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసిన ప్రశాంత్ కిషోర్.. తాజాగా ఢిల్లీ పీఠంపై చీపురు పార్టీని కూర్చోబెట్టారు. కాగా, పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే అధినేత స్టాలిన్ తరపున కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నారు. తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచించనున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపులో కూడా ప్రశాంత్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ను వ్యూహకర్తగా నియమించుకుంటే తమ గెలుపు ఖాయమన్నట్లుగా పార్టీలు భావిస్తుండటం గమనార్హం.