తమిళనాడులో పీకే వ్యూహాలు.. డీఎంకే తరఫున పనిచేసేందుకు ఒప్పందం.. ఎంకే స్టాలిన్ వెల్లడి
జేడీయూ బహిష్కృత నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి సౌత్ ఇండియాలో రాజకీయ సేవలు అందించనున్నారు. తమిళనాడులో 2021లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరఫున వ్యూహరచన, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఒప్పందాలు కుదిరాయి. ఈ విషయాన్ని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆదివారం అధికారికంగా వెల్లడించారు. పీకే టీమ్ తో కలిసి పనిచేయడం చాలా సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.
డీఎంకే పటిష్టంగా ఉన్నప్పటికీ..
జయలతిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో వర్గపోరు తలెత్తడం, చివరికది బీజేపీతో అంటకాగేస్థితికి చేరుకున్న తర్వాత తమిళనాడులో డీఎంకే మరింత బలపడింది. స్టాలిన్ నాయకత్వంలోని ఆ పార్టీ గతేడాది లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది. ప్రస్తుతానికి డీఎంకే పటిష్టంగా ఉన్నప్పటికీ.. బీజేపీ, రజనీకాంత్, కమల్ హాసన్ ల రూపంలో ఇబ్బందులు ఎదుర్కోవద్దన్న ఉద్దేశంతోనే పీకేను వ్యూహకర్తగా నియమించుకున్నట్లు తెలుస్తోంది.
పీకే టీమ్ బిజీబిజీ
గతేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ వైసీపీ తరఫున వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ తొలిసారి సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు డీఎంకే ద్వారా తమిళనాడులోనూ అడుగుపెట్టబోతున్నారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ సంస్థ ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున వ్యూహాలు రచించే పనిలో బిజీగా ఉంది. అటు వెస్ట్ బెంగాల్ లోనూ మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీకి కూడా పీకే టీమ్ పనిచేస్తోంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు జరుగనున్నాయి.
ఢిల్లీ నుంచే ఆపరేషన్..
జేడీయూలో చేరిన తొలినాళ్లలో పూర్తిగా పాట్నాకు షిఫ్ట్ అయిపోయిన ప్రశాంత్ కిషోర్.. కేజ్రీవాల్ కు సహకారిగా ఉండేందుకు మళ్లీ ఢిల్లీకి మకాం మార్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షాపై విమర్శలు చేయడం, ఆ పని నచ్చని జేడీయూ హైకమాండ్ పీకేను పార్టీ నుంచి బహిష్కరించడం తెలిసందే. ఢిల్లీలోనే ఉంటూ బెంగాల్ కూడా వ్యూహాలు రచిస్తున్నారు పీకే.