ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2020: ఆ పార్టీ విజయం కోసం రంగంలోకి ప్రశాంత్ కిషోర్
ప్రశాంత్ కిషోర్... ఎన్నికల వేళ ఎప్పుడూ వినిపించే పేరు. ఎన్నికల స్ట్రాటజిస్టుగా పలు రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు పనిచేసి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 2014లో నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి తీసుకురావడంలో తెరవెనక ఉన్నది ప్రశాంత్ కిషోరే. 2014సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించాక ప్రపంచానికి ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరో తెలిసింది. ఆ తర్వాత జరిగిన వరస ఎన్నికల్లో ఆయన కోసం ఆయా పార్టీల అధినేతలు వెంటపడ్డారు. ఈ మధ్యే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ టీమ్ను హైర్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో చేరిపోయారు ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
ఇక తర్వలో ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలోనే ఆమ్ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్లో ఓ పోస్టు చేశారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో నడుస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ( ఐపాక్) ఆమ్ఆద్మీ పార్టీకి స్ట్రాటజిస్ట్గా పనిచేసేందుకు ఒప్పుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్. బలమైన బీజేపీతో పోటీ పడుతున్నందున ఐపాక్ సలహాలు సూచనలు తీసుకుని తిరిగి అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెన్స్ను వ్యక్తం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి. ఈ మేరకు అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్కు ఐపాక్ తిరిగి సమాధానంగా ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు ఎన్నో ప్రత్యర్థ పార్టీలను ఎదుర్కొన్నామని ఆ సందర్భాల్లో ఆమ్ఆద్మీ పార్టీని ఎదుర్కోవడం కష్టంగా అనిపించిందని ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సంస్థ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బీహార్లోని జేడీయూ పార్టీకి జాతీయఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ మిత్రపక్షంగా జేడీయూ ఉంది. 2014 నుంచి ఎన్నో పార్టీలకు సహకరించి వారిని అధికారంలోకి తీసుకొచ్చింది ఐపాక్ సంస్థ.2015లో జేడీయూ అధికారంలోకి వచ్చి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారంటే అది ప్రశాంత్ కిషోర్ వల్లే అని స్వయంగా నితీష్ కుమారే చెప్పారు. అప్పట్లో నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ తర్వాత బీజేపీకి మిత్రపక్షంగా జేడీయూ మారింది.
After Punjab results, we acknowledged you as the toughest opponent that we have ever faced. Happy to join forces now with @ArvindKejriwal and @AamAadmiParty. https://t.co/5Rcz4ie6Xs
— I-PAC (@IndianPAC) December 14, 2019
ఇక ఆంధ్రప్రదేశ్లో 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఇటు లోక్సభ అటు అసెంబ్లీ సీట్లను స్వీప్ చేయడంలో ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించారు. దీంతో సీఎంగా వైయస్ జగన్ అయ్యారు. ఇదిలా ఉంటే పౌరసత్వసవరణ బిల్లుపై వ్యతిరేక స్వరం వినిపించి ప్రశాంత్ కిషోర్ గతకొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు.