బీజేపీకి అల్టిమేటం ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ .. పీకేపై నిప్పులు చెరుగుతున్న బీజేపీ
దేశవ్యాప్తంగా రగులుతున్న ఎన్నార్సీ మంటలు బీజేపీకి తలనొప్పిగా తయారయ్యాయి. ఇప్పటికే బీజేపీకి మిత్ర పక్షాలుగా ఉన్న పలు రాజకీయ పార్టీలు బీజేపీకి గుడ్ బై చెప్తే రానున్న కాలంలో బీజేపీకి మరో మిత్రపక్షం గుడ్బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న జేడీయూ బీజేపీ పట్ల కాస్త ప్రతికూల వైఖరిని ప్రదర్శిస్తుంది. తాజాగా ప్రశాంత్ కిషోర్ బీజేపీకి అల్టిమేటం జారీ చెయ్యటంతో ఇప్పుడు దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది.
కేంద్ర మంత్రికి కౌంటర్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ... ఏమన్నారంటే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాలపై పీకే వ్యాఖ్యలు
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకి కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో కేంద్రంపై నితీష్ ఇప్పటికే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు . ఇక ఇదే సమయంలో తాజాగా ఎన్ఆర్సీ విషయంలో కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్ లో ఎన్నార్సీ ఆందోళనల నేపధ్యంలో ఆయన బిహార్లో ఎన్ఆర్సీ అమలు చేసే ప్రసక్తే లేదని బహిరంగంగానే ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో పీకే సీట్ల పంపకాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 50:50 సీట్ల పంపకాల ఒప్పందం కుదరదనిచెప్పిన పీకే
బీజేపీ-జేడీయూలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల కేటాయింపుపై ఇప్పటికే చర్చలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలో జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ నాయకత్వం అంచనాలు వేస్తున్నట్లు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50:50 సీట్ల పంపకాల ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. అంతే కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జేడీయూకే సింహాభాగం సీట్లు కేటాయించాలని అన్నారు. సీట్ల ఒప్పందంపై బీజేపీ నేతలు మరోసారి పునపరిశీలన చేసుకోవాలని ప్రశాంత్ కిశోర్ సూచించారు. అలాగే 1:4 ఫార్మూలాను పీకే తెరపైకి తీసుకువచ్చారు.
ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఎన్నార్సీ కి వ్యతిరేకంగా , సీఏఏ కు నిరసనగా పీకే చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీకి తలనొప్పిగా మారగా తాజాగా సీట్ల పంపకాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరోమారు బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. అంతే కాకుండా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు ఎన్నికల ప్రచార వ్యూహాలను అందిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుకు కారణం కావాలని పని చేస్తున్న నేపధ్యం కూడా బీజేపీకి ఏ మాత్రం రుచించటం లేదు .
ఇరు పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకుంటారని పీకే పై మండిపడుతున్న బీజేపీ
ఇక ఇప్పుడు పీకే సీట్ల పంపకాలపై చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతలు సీట్ల పంపకాలపై ఇరు పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకుంటారని, దీనిలో పీకే తలదూర్చడం సరికాదని మండిపడ్డారు . గత లోక్సభ ఎన్నికల్లో అనుసరించిన 50:50 ఫార్మూలానే ఈసారి కూడా పాటిస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు . దీంతో ప్రశాంత్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపగా బీజేపీతో జేడీయూ స్నేహం సవ్యంగా సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. . ఇక బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న నితీష్కు రానున్న అసెంబ్లీ ఎన్నికలు పెద్ద సవాలుగా మారాయి.