ఢిల్లీ ఎన్నికలలో ఆ పని చెయ్యండి చాలు ... అమిత్ షాకు కౌంటర్ వేసిన ప్రశాంత్ కిషోర్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు జేడీయూ నేత కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కు ఎన్నికల వ్యూహకర్త గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ తనదైన శైలిలో కౌంటర్ వేశారు . ఢిల్లీ ఎన్నికల నేపధ్యంలో షహీన్బాగ్లో జరిగిన ఘటనలపై అంతే ఆగ్రహంతో ఈవీఎం బటన్ను నొక్కి బీజేపీకి ఓటేసి ప్రతిఘటించాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు . ఇక దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా ఆక్షేపించారు .
అమిత్ షా కు ప్రశాంత్ కిశోర్ కౌంటర్: ఏ విషయంలో అంటే
షహీన్బాగ్లో సీఏఏ పై ఆగని నిరసనలు
సీఏఏకు వ్యతిరేకంగా వందలాదిగా ప్రజలు గత 30 రోజులుగా షహీన్బాగ్లో శాంతియుంతంగా నిరసనలు తెలుపుతున్నారు. దీంతో సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనల్లో షహీన్ బాగ్ కూడా నిలిచినట్టయింది. అయితే ఈ నిరసనలను వ్యతిరేకిస్తూ బీజేపీకి ఓటు వెయ్యాలని కోరారు అమిత్ షా . ఢిల్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా షహీన్బాగ్ నిరసనలపై విరుచుకుపడ్డారు. సీఏఏ ని కావాలని రాజకీయ పార్టీలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
బీజేపీకి ఓటేసి షహీన్ బాగ్ ఆందోళనలకు చెక్ పెట్టాలన్న అమిత్ షా
షహీన్బాగ్లో జరిగిన ఘటనలను అంతే ఆగ్రహంతో ఈవీఎం బటన్ నొక్కడం ద్వారా ప్రతిఘటించాలని ఓటర్లను కోరిన ఆయన బీజేపీ అభ్యర్థులకు ఓటు వేస్తే ఢిల్లీతో పాటు దేశాన్ని సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు . ఈవీఎం బటన్లను కేవలం ప్రేమతో నొక్కండి. చిన్న పనులతోనే పెద్ద షాక్లు ఇవ్వచ్చు. అందువల్ల సౌభ్రాతృత్వం, స్నేహానికి వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు అని ఓ ట్వీట్లో కౌంటర్ ఇచ్చారు.
ఢిల్లీపై ప్రేమతో ఓటు వేయండన్న ప్రశాంత్ కిషోర్
ఢిల్లీపై ప్రేమతో ఓటు వేయండి అంతేచాలు అని పేర్కొన్న పీకే ప్రస్తుతం ప్రభుత్వంపై ఎలాంటి అసహనంలేదు. సోదరభావం, స్నేహ భావానికి ఎలాంటి ప్రమాదంలేదు అని అమిత్ షాకు కౌంటర్ వేశారు . ఎన్నికల వ్యూహకర్త అయిన పీకే ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు రాజకీయ సలహాదారుడిగా పని చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపునకు తెరవెనుక ప్రణాళికలు రచిస్తున్నారు. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికలకు అటు ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.