అమిత్ షా కు ప్రశాంత్ కిశోర్ కౌంటర్: ఏ విషయంలో అంటే
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశమంతటా ఎన్ఆర్సీ అమలు చేస్తామంటూ చేసిన ప్రకటనపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో అసోంలో చేసిన విధంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ దేశవ్యాప్తంగా తయారు చేస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసిన ప్రకటనపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ అనూహ్యంగా జేడీయూ నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త గా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ తనదైన శైలిలో స్పందన తెలియజేశారు.
ఎన్ఆర్సీ అమలుపై అమిత్ షాకు కౌంటర్ వేసిన ప్రశాంత్ కిషోర్
దేశంలో 15కు పైగా రాష్ట్రాలు బీజేపీయేతర ముఖ్యమంత్రులు చేతిలో ఉన్నాయని పేర్కొన్న ప్రశాంత్ కిషోర్ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ముందు వీళ్లల్లో ఎంతమందిని సంప్రదించారు అని ప్రశ్నించారు. ఇక ఎన్ఆర్సీ నిర్వహణకు ఎన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయని చూస్తే కూడా తనకు ఆశ్చర్యంగా ఉందని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 55 శాతానికి పైగా జనాభా గల 15 రాష్ట్రాలు బిజెపి యేతర ముఖ్యమంత్రుల చేతిలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు .
బీజేపీయేతర రాష్ట్రాల సీఎం లతో సంప్రదించారా ?
15కు పైగా రాష్ట్రాలు ఎన్ఆర్సీ అమలుకు సహకరిస్తారు అన్న అంశం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. బీజేపీయేతరనేతలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలో ఇప్పటివరకు ఎవరినైనా సంప్రదించారా? ఎంతమంది దీనికి అంగీకరించారు అన్నదానిపై తనకు ఆశ్చర్యంగా ఉంది అని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ఎన్నార్సీ పేరుతో మతాల ఆధారంగా ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే వ్యాఖ్యానించారు.
పశ్చిమబెంగాల్ లో ఎన్ఆర్సీ నిర్వహించటానికి వీల్లేదన్న మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్ఆర్సీ నిర్వహించటానికి వీల్లేదని, అందుకు తాను ఒప్పుకోను అని గట్టిగా తేల్చి చెప్పారు. ఇక పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యల నేపథ్యంలో అమిత్ షా ఈ మేరకు వివరణ ఇచ్చారు.దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు చేస్తామని రాజ్యసభలో స్పష్టం చేసిన అమిత్ షా దేశవ్యాప్తంగా ఉన్న పౌరులు, భారతీయ పౌరులా .. లేక అక్రమ వలసదారులా అన్నది మాత్రమే చూస్తామన్నారు. ఈ ప్రక్రియలో మతం ఆధారంగా ఎలాంటి వివక్షతకు చోటు లేదని వివరణ ఇచ్చారు.
అమిత్ షా ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, టీఎంసీ,జేడీయూ పార్టీలు
ఇతర మతాలకు చెందిన వారిని ఈ పౌరసత్వ జాబితాలో చేర్చకూడదని ఎన్నార్సీలో ఎలాంటి నిబంధనా లేదని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలు చేయాలన్న నిర్ణయం తప్పనికాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ పార్టీలు అమిత్ షా ప్రకటనను ఖండించాయి. ఎన్నార్సీని అమల్లోకి తెస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించాయి. మరోవైపు అసోం ఆర్ధిక మంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఎన్నార్సీ అమలును తీవ్రంగా వ్యతిరేకించారు. అసోంలో ప్రస్తుతం అమలు చేస్తున్న ఎన్నార్సీని రద్దు చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు.