అంచనాలు అందుకోలేకపోతున్న ప్రశాంత్ కిషోర్ 'ఐప్యాక్'?
ఐ ప్యాక్ అంటే తిరుగులేని పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ అని పేరు. ఆ కంపెనీ వ్యూహాలు, ఎత్తుగడలు, ఆచరణాత్మక విధానం అన్నీ ఒకస్థాయిలో ఉంటాయి. అటువంటి కంపెనీ సేవలు అందుకోవాలని ప్రతి రాజకీయపార్టీ తలపోస్తోంది. కానీ గెలిచే పార్టీకే ఆయన ప్రచారం చేస్తారనే వ్యాఖ్యలు వినవస్తూనే ఉన్నాయి. రాజకీయాల్లో ఓనమాల దగ్గర నుంచి చివరి గుడింతం వరకు నేర్చుకున్నవారు కూడా పీకే కంపెనీల సేవల కోసం తపిస్తున్నారు.
పీకే కోసం ఎదురుచూడటమే పార్టీల బలహీనత?
వీరికంటే పీకే గొప్ప స్ట్రాటజిస్టా? అంటే అదీ కాదు. కానీ ఎక్కడ ఆయన విజయవంతమయ్యారు? అంటే కేవలం గెలిచే పార్టీకి ప్రచారం చేయడంవల్ల అని ప్రత్యర్థి కంపెనీలు చెబుతున్నారు. పీకే తర్వాత మరెంతమందో దీన్ని ఒక వృత్తిలా ఎంచుకున్నారు. చివరకు దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే.. రాజకీయాల్లో నలిగిన పార్టీలుకూడా చివరకు పీకే ప్రచారం చేస్తే కచ్చితంగా అధికారం దక్కుతుదనే నమ్మకానికి వచ్చేశాయి. తమ బలాన్ని నమ్ముకోవడం మానేసి పీకే బలం కోసం ఎదురుచూసే బలహీనత అలవాటు పడింది. సాధించిన రెండు మూడు విజయాలవల్లే వారిలో, వారి పార్టీల్లో అటువంటి నమ్మకాన్ని పీకే పాదుకొల్పాడు.
మారుతున్న కాలంతోపాటు మారాలి!
మారుతున్న కాలంతోపాటు మనిషి కూడా మారాలి. లేదంటే మనుగడ కష్టమవుతుంది. ఎల్లప్పుడూ విజయాలు పలకరించవని పీకేకు తెలియనిదేంకాదు. అందుకే ఆయన బీహార్ లో జనసురాజ్ యాత్ర చేస్తున్నారు. ఇప్పుడు ఏయే రాష్ట్రాల్లో ఏయే పార్టీలకు తాను ప్రచారం చేస్తే గెలిచాయో అవన్నీ తర్వాత ఎన్నికల్లో గెలుస్తాయో? లేదో? అని ఆయన కూడా నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. అందుకే తన సహచరులకు బాధ్యతలు అప్పగించి తాను పాదయాత్రకు పరిమితమయ్యారు. పీకే ప్రచారం చేస్తే ఓటమిపాలయ్యారు? అని చెప్పుకోవడాన్ని ఆయన ఇష్టపడటంలేదు.
తట్టా బుట్టా సర్దుకొని ఏపీకి!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఐప్యాక్ బాధ్యతలను తన సహచరులకు అప్పగించారు. కానీ ఒక్క తెలంగాణ కోసమే వ్యక్తిగతంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ సేవలు అవసరం లేదని కేసీఆర్ చెప్పడంతో పీకే టీములన్నీ తట్టా బుట్టా సర్దుకొని ఏపీకి వచ్చేశాయి. వేళ్లమీద లెక్కపెట్టగలిగిన సంఖ్యలో మాత్రమే ఐప్యాక్ సిబ్బంది హైదరాబాద్ లో ఉన్నారు.
కేసీఆర్ వద్దన్నారే?
కేసీఆర్ పై పీకే ప్రశంసలు కూడా భారీగా ఉండేవి. ప్రగతి భవన్ లో కేసీఆర్ గంటల తరబడి చర్చించేవారు. ఆయన ఉచితంగా చేస్తున్నారని పీకే ప్రకటించారు. తనను జాతీయస్థాయిలో ఎక్స్ పోజ్ చేయడంలో పీకే ఏమీ చేయలేకపోయారనే అసంతృప్తి కేసీఆర్ లో నెలకొంది. తాను పెట్టే జాతీయపార్టీకి తాను సరిపోతానని భావించారు.
ప్రతి అడుగుకు పీకే వ్యూహాలంటూ వాటికి అలవాటు పడితే అదో కొత్తతరహా రాజకీయ ఎత్తులవుతాయని కేసీఆర్ భావించారు. దీనికన్నా మొదటి నుంచి తాున నేర్చుకున్న రాజకీయాలు, తన వ్యూహాలపైనే ఆయనకు ఎక్కువ నమ్మకం కలిగింది. జాతీయ రాజకీయాల్లో పీకే తనకు ఏమీ చేయలేరనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చేశారు. ఈ విషయం చెప్పడంతో పీకే టీములన్నీ ఏపీకి తరలివెళ్లాయి. ఎంతకాలం ఆయన పరాజయాన్ని తన దరిదాపుల్లోకి రాకుండా ఆపుతారో కాలమే నిర్ణయించనుంది.