ప్రేమలో విఫలమై.. డిప్రెషన్ గురై.. అక్రమంగా పాకిస్థాన్లోకి.. ప్రశాంత్ తండ్రి క్లారిటి!
పాకిస్తాన్ చెరలో ఉన్న తెలుగు యువకుడు ప్రశాంత్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగుచూస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ప్రశాంత్ రెండు సంవత్సరాల క్రితం మరో సాఫ్ట్వేర్ యువతితో ప్రేమాయాణంలో పడ్డాడని, దీంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని ప్రశాంత్ తండ్రి బాబూరావు తెలిపారు. డిప్రెషన్ వల్లే రాజస్థాన్ నుంచి పొరపాటున పాకిస్తాన్లోకి అడుగు పెట్టి ఉంటాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంతేగాని ప్రశాంత్కు ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం లేదని ఆయన వివరించారు.
Recommended Video
ప్రేమలో పడ్డ ప్రశాంత్
ప్రశాంత్ మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపనీలో ఉద్యోగం చేసేవాడని, అనంతరం బెంగళూర్కు వెళ్లాడని చెప్పారు. అక్కడే తన కుమారుడి ప్రేమ చిగురించినట్టు తండ్రి బాబూరావు చెప్పారు. అయితే రెండు సంవత్సరాల నుండి ప్రశాంత్ అచూకీ లభించలేదని , దీంతో ఏప్రిల్ 2017లోనే మాదాపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఇక విశాఖకు చెందిన ప్రశాంత్ కుటుంబం గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ కూకట్పల్లిలోని భగత్సింగ్నగర్లో నివాసం ఉంటున్నది.
ఢిల్లి వెళ్లనున్న ప్రశాంత్ తండ్రి
పాకిస్తాన్లో అక్రమంగా ప్రవేశించాడనే కారణంపై ప్రశాంత్తో పాటు మధ్యప్రదేశ్కు చెందిన హరీలాల్ అనే మరోవ్యక్తిని ఈ నెల 14న పాకిస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై అక్రమ చొరబాట్లకు సంబంధించి కేసులు నమోదు చేశారు. దీంతో ప్రశాంత్ ఇలాంటి వ్యవహారాల్లో ఎప్పుడు జోక్యం చేసుకోలేదని చెప్పారు. ఇదే అంశాన్ని ఢిల్లీ వెళ్లి రాయబార కార్యాలయానికి వెళ్లి వివరిస్తామని, తన కుమారుడిని క్షేమంగా అప్పగించాలని కోరుతామని ప్రశాంత్ తండ్రి తెలిపారు.
విచారణ చేస్తున్న తెలంగాణ పోలీసులు
ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు సైతం ప్రశాంత్ వ్యవహారంపై దృష్టి సారించారు. రెండు సంవత్సరాల క్రితం మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పట్టించుకోని పోలీసులు.. ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించడంతో పూర్తి విచారణ చేపట్టారు. దీంతో ప్రశాంత్ 2017 నుండి ప్రశాంత్ ఎక్కడెక్కడ తిరిగారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిపారు. ఇక ప్రశాంత్తో పట్టుబడ్డ హరీలాల్తో ఎలా పరిచయం అనే కోణంలో విచారణ చేయడంతో పాటు విశాఖ పోలీసుల సహాయంతో మరింత సమాచారం సేకరించి కేంద్రహోంశాఖకు పంపుతామని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ తెలిపారు.
ఇలాంటీ కేసులో గతంలో కూడ ఉన్నాయి
అయితే రాజస్థాన్ సమీపంలోని సరిహద్దులో ఉండే చోలిస్తాన్లో పాకిస్తాన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. అయితే రాజస్థాన్ ఎడారి ప్రాంతం కావడంతో ఇసుక తుఫాన్ వల్ల ఒక్కోసారి ఇరుదేశాల మధ్య ఉండే సరిహద్దు రేఖలు తొలగిపోతాయని, ఇలా అక్కడ సంచరిస్తున్న ఇతర దేశాలకు చెందిన వారు కూడా సరిహద్దు దాటిన సందర్భాలు గతంలో కూడా చాలానే ఉన్నాయని భారత అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రశాంత్ కేసులో కూడ ఇదే జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి..