నిన్న మోదీ, నేడు వైఎస్ జగన్, రేపు మీరే సీఎం, హీరో విజయ్ కు ఆశలు రేపుతున్న పీకే, జస్ట్ !
చెన్నై: చాకచక్యమైన, తెలివైన రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ (పీకే) కోలీవుడ్ ప్రముఖ హీరో, దళపతి విజయ్ ను తమిళనాడు ముఖ్యమంత్రిని చేస్తాని ఆశలు రేకెత్తిస్తున్నారు. వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎలా చేశామో అలాగే మిమ్మల్ని తమిళనాడు ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రముఖ నటుడు విజయ్ కు ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారని వెలుగు చూసింది. 2021లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మిమ్మల్ని కచ్చితంగా తమిళనాడు సీఎం చేస్తామని హీరో విజయ్ కు స్వయంగా ప్రశాంత్ కిశోర్ హామీ ఇచ్చారని సమాచారం.
అక్రమ సంబంధం, ఏకాంతంలో ప్రియురాలికి పదేపదే ఫోన్లు, చంపేసి, నిప్పుపెట్టిన ప్రియుడు!
మోదీ, వైఎస్ జగన్, నితీశ్ కుమార్
ఇంతకు ముందు ప్రశాంత్ కిషోర్ ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. దీంతో ప్రశాంత్ కిషోర్ కు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా పట్టిందంతా బంగారం అయ్యిందని పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.
యూనివర్శల్ హీరోతో విభేదాలు
మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ కు ఇప్పటికే రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారు. అయితే హీరో కమల్ హాసన్ కు, ప్రశాంత్ కిషోర్ కు భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ విధానం విషయంలో ప్రశాంత్ కిషోర్ నిర్ణయాలను కమల్ హాసన్ విభేదించారని, అందుకే ఇద్దరూ దూరం కావాలని నిర్ణయించారని తెలిసింది. త్వరలోనే మక్కల్ నీది మయ్యం పార్టీతో ఒప్పందం రద్దు చేసుకోవాలని ప్రశాంత్ కిషోర్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
సౌత్ ఇండియా సూపర్ స్టార్
త్వరలో రాజకీయ రంగప్రవేశం చేస్తున్న సౌత్ ఇండియా సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ కూడా తన రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అయితే ఇప్పటికే కమల్ హాసన్ కు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారు. ఇటీవల ముంబైలో ఓ ప్రముఖుడి ఇంటిలో రజనీకాంత్, ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యి సుధీర్ఘంగా రాజకీయల గురించి చర్చించారని ప్రచారం జరిగింది.
తమిళనాడులో సర్వే
తమిళనాడులో రాజకీయ పరిస్థితులను అంచనా వెయ్యడానికి ప్రశాంత్ కిషోర్ బృందం ( ibac team) సమగ్ర సర్వే నిర్వహిస్తోంది. తమిళనాడు రాజకీయ నాయకులతో పాటు కమల్ హాసన్, రజనీకంత్ తో పాటు విజయ్ పేరును ప్రశాంత్ కిషోర్ బృందం చేర్చింది. ప్రశాంత్ కిషోర్ బృందం సమగ్ర సర్వే లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.
సర్వేలో ఎంత శాతం ఓట్లు !
ప్రశాంత్ కిషోర్ బృందం నిర్వహించిన సర్వేలో 28 శాతం మంది ప్రజలు విజయ్ కు మద్దతు ఇచ్చారని వెలుగు చూసింది. ఇదే విషయంపై ప్రశాంత్ కిషోర్ హీరో విజయ్ ను కలిసి సర్వే వివరాలు క్షుణ్ణంగా వివరించారని సమాచారం. మీకు 28 శాతం మంది ప్రజలు మద్దతు ఇచ్చారని, మీరు రాజకీయాల్లోకి వస్తే మిమ్మల్ని సీఎంగా గెలిపించడానికి ఇప్పటి నుంచి వ్యూహరచన చేస్తామని ప్రశాంత్ కిషోర్ హీరో విజయ్ కు హామీ ఇచ్చారని తెలిసింది.
చెప్పింది చెయ్యండి !
మీరు ముఖ్యమంత్రి కావడానికి తాము చెప్పింది ఒక సంవత్సరం పాటు చేస్తే చాలని, తరువాత అన్నీ తామే చూసుకుంటామని, మీరు సీఎం కావడం గ్యారెంటీ అని ప్రశాంత్ కిషోర్ హీరో విజయ్ కు భరోసా ఇచ్చారని తెలిసింది.
ఇదే సమయంలో తన బృందం ఏ విధంగా సర్వే చేసింది ? ఎవరెవరికి ఎంత శాతం మంది ప్రజలు మద్దతు ఇచ్చారు అనే పూర్తి వివరాలను హీరో విజయ్ కు ప్రశాంత్ కిషోర్ వివరించారని సమాచారం.
జగన్ ను ఎలా సీఎం చేశామంటే !
ఆంధ్రప్రదేశ్ లో యువకుడైన వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహకర్తగా తాము పని చేశామని, మా పనితనంతో వైఎస్ఆర్ సీపీని గెలిపించి జగన్ ను ఎలా సీఎం చేశామో పూస గుచ్చినట్లు హీరో విజయ్ కు ప్రశాంత్ కిషోర్ వివరించారని తెలిసింది. వైఎస్ జగన్ సీఎం అయినట్లు తమిళనాడులో మీరు సీఎం అవుతారని అది మా భాద్యత అని ప్రశాంత్ కిషోర్ హీరో విజయ్ కు హామీ ఇచ్చారని తెలిసింది.
దళపతి నిర్ణయం
ప్రశాంత్ కిషోర్ చెప్పిన విషయాలు అన్నీ కూల్ గా విన్న హీరో విజయ్ నవ్వుతూ ఉండి పోయారని తెలిసింది. రాజకీయాల గురించి హీరో విజయ్ ఎలాంటి నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదని తెలిసింది. అయితే తమిళనాడు మొదటి ప్రధాన్యత విజయ్ కు ఇవ్వాలని, తరువాత ఆయన ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోతే తరువాత వేరే విషయం గురించి ఆలోచించాలని ప్రశాంత్ కిషోర్ ఎదురు చూస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద హీరో విజయ్ నిర్ణయం కోసం ప్రశాంత్ కిషోర్ అండ్ టీం ఎదురుచూస్తోంది.