ఆ రోజేం జరిగిందంటే, తాగుడుకు బానిసైంది: ప్రత్యూష ప్రియుడు
ముంబై: ఇరవై రోజుల క్రితం 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ వెల్లడించాడు. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను చాలా విషయాలు చెప్పాడు.
ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి నేను, ప్రత్యూష, మా ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ ఒకరు.. ముగ్గురం కలిసి ఫ్లాట్లోనే పార్టీ చేసుకున్నామని, రాత్రి అంతా చాలా కబుర్లు చెప్పుకున్నామని, ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు మా చిట్ చాట్ కొనసాగిందని చెప్పాడు.
ఆ రోజుకి బయట తిందామని నిర్ణయించుకున్నామని, ఆ రోజు ఇంట్లోనే వంట చేసుకొని ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదేమో అన్నాడు. నేను నిద్ర లేచేసరికి ప్రత్యూష స్నానం చేసి మళ్లీ తాగుతూ కూర్చుందని, దాంతో తమ ఇద్దరి మధ్య చిన్న తగాదా జరిగిందని చెప్పాడు.
ఆమె ఇటీవలే తాగుడుకు బానిస అయిందని, తాగడం తగ్గించాలని నేను మందలించానని చెప్పాడు. అయినా వినిపించుకోకుండా అదే పనిగా తాగుతూ ఉండటంపై తాను మండిపడ్డానని చెప్పాడు. తినడానికి ఏమైనా తీసుకొని వస్తానని తాను బయటకు వెళ్లానని చెప్పాడు. ఇదంతా ఏప్రిల్ 1న జరిగిందన్నాడు.
ఆ తర్వాత తిరిగి తాను కాసేపటికి ప్లాట్కు చేరుకున్నానని, ఎంతసేపు తలుపు తట్టినా ప్రత్యూష తీయలేదని చెప్పాడు. ఇతరుల సాయంతో లోపలకు ప్రవేశించానని చెప్పాడు. అక్కడ ఆమె ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించిందని, ఆమెను కిందకు దించి ముఖంపై నీళ్లు చల్లి, నోటి ద్వారా ఊపిరి అందించే ప్రయత్నం చేశానన్నాడు.
చలనం లేకపోయేసరికి ఆసుపత్రికి తీసుకు వెళ్లానని, ప్రత్యూష మృతి చెందినట్లు వైద్యులు చెప్పారన్నాడు. ఆమె చనిపోయిందని తెలిసి షాకయ్యానని, మీడియా ప్రశ్నలకు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పాడు. ఆమె ఆత్మహత్య చేసుకుందన్న విషయాన్ని తాను ఇంత వరకు నమ్మలేకపోతున్నానని చెప్పాడు. ప్రత్యూష పరస్పరం అంగీకారంతోనే గర్భస్రావం చేయించుకుందని కూడా చెప్పాడు.