కారణం ఏంటీ?: ప్రత్యూష కేసులో రాహుల్ తరుపు లాయర్ ఔట్
ముంబై: బుల్లితెర సీరియల్ 'చిన్నారి పెళ్ళి కూతురు' ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్తం అంశం వెలుగు చూస్తోంది. తాజాగా ఆమె బాయ్ప్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ తరుపు న్యాయవాది ప్రత్యూష బెనర్జీ కేసు నుంచి తప్పుకున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కాగా, ప్రత్యూష తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. రాహుల్ రాజ్ సింగ్పై ఐపీసీ సెక్షన్లు 306, 504, 506, 303 ప్రకారం ఆరోపణలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాహుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేసే అవకాశముందని అంటున్నారు.
ప్రత్యూష తల్లిదండ్రుల వాదనలు విన్న అనంతరం ఆత్మహత్యకు కారణం ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే రాహుల్కు పదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చునని జెబుతున్నారు. చిన్నారి పెళ్లికూతురుగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన 'చిన్నారి పెళ్ళి కూతురు' ఫేం ప్రత్యూష బెనర్జీ ఏప్రిల్ 1న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే మంగళవారం ప్రత్యూష తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ రాహుల్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమార్తెను రాహుల్ తరచూ కొట్టేవాడని ఆమె ఆరోపించారు. తమ కూతురికి అబద్ధాలు చెప్పి, ఆమెను మోసగించాడని ప్రత్యూష తండ్రి తెలిపారు.
రాహుల్ వాళ్ల అమ్మ ఎమ్మెల్యే అని, తమకు ముంబైలో నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయని ప్రత్యూషను నమ్మించాడని ఆరోపించారు. అంతేకాదు హోమ్టౌన్లో 150 ఎకరాల భూమి ఉందని చెప్పినట్లు తెలిపారు. ఇలా కట్టుకథలతో తమ కూతురిని నమ్మించి, తీరా పెళ్లనే సరికి మొఖం చాటేశాడని ప్రత్యూష తల్లిదండ్రులు తెలిపారు.
రాహుల్ గురించి ఈ మధ్యే ప్రత్యూషకు అసలు నిజం తెలిసిందని తండ్రి చెప్పాడు. రాహుల్కు తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడని ప్రత్యూషకు తెలిసిందని చెప్పారు. తనకు జరిగిన మోసాన్ని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయి, తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ప్రత్యూష తండ్రి ఆరోపించారు.
ప్రత్యూష ఆత్మహత్య ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యూష నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే ఒంటి పైన గాయాలు ఎందుకు ఉన్నాయని, ఆసుపత్రిలో చేర్పించాక ప్రియుడు ఎందుకు పారిపోయాడని ఆమె తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.