'ప్రవీణ్ తోగాడియాను అడ్డుకుంటాం, ప్రసంగాలకు అనుమతివ్వం'
బెంగళూరు: విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియాను కర్ణాటకలో సభలు సమావేశాలలో పాల్గొనడానికి వస్తే అడుగుపెట్టనివ్వమని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి కే జే జార్జ్ స్పష్టం చేశారు. ప్రవీణ్ తొగాడియా బహిరంగ సమావేశాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
మంగళవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లా పుత్తూరు తదితర ప్రాంతాలలో జరిగిన విరాట్ హిందూ సమాజోత్సవ బహిరంగ సభలలో ప్రవీణ్ తొగాడియా ప్రసంగించారని గుర్తు చేశారు. అనంతరంరాష్ట్రంలో అనేకచోట్ల మతఘర్షణలు జరిగాయని విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అనేక నగరాలు, పట్టణాలలో విరాట్ హిందూ సమాజోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రవీణ్ తొగాడియా మాట్టాడటానికి ఎట్టి పరిస్థితులలో అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. అదే విధంగా ప్రవీణ్ తొగాడియా మాట్లాడిన మాటలు, వీడియో క్లిప్పింగ్లు సైతం ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పారు.
కర్ణాటకలోని అనేక చోట్ల విరాట్ హిందు సమాజోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కాని ప్రవీణ్ తొగాడియా అడుగు పెట్టకుండా ఆయా జిల్లాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తొగాడియాను రాష్ట్రంలో సంచరించి సభలు, సమావేశాలలో పాల్గోనడానికి అవకాశం ఇవ్వాలని హైకోర్టులో అర్జీ సమర్పించారు. తొగాడియా సభలు సమావేశాలలో పాల్గోనకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆరోపణలు ఉన్నాయి.