మళ్లీ మోడీపై ఆరోపణలు! కాల్ రికార్డులు బయటపెట్టాలన్న తొగాడియా, వివరణ కోరిన శివసేన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా మళ్లీ సంచలన ఆరోపణలు చేశారు. మోడీ తనకు వ్యతిరేకంగా కుట్రకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
కొన్ని రోజులుగా ప్రధాని మోడీకి, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచి జాయింట్ కమిషనర్ జేకే భట్కు మధ్య జరిగిన కాల్ రికార్డులను బయటపెట్టాలని తొగాడియా డిమాండ్ చేశారు. ఆ కాల్ రికార్డులు బయటికొస్తే మరిన్ని వాస్తవలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.
తొగాడియా వివాదాన్ని రెండు మూడు రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని విశ్వహిందూ పరిషత్లోని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఇష్యూపై కొంతమంది వీహెచ్పీ నాయకులు లేఖల ద్వారా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయంపై రాష్ట్రీయ స్వయక్ సేవక్ సంఘ్ జోక్యం చేసుకోవాలని మరికొందరు నాయకులు అభ్యర్థిస్తున్నారు. అయితే విశ్వహిందూ పరిషత్లోని ఓ వర్గం మాత్రం ఈ మొత్తం వ్యవహారానికి దూరంగా ఉండిపోయింది.
ఈ నెల 26ప అలహాబాద్లో జరగనున్న మార్గదర్శక్ మండల్, సంత్ల సమావేశంలో ప్రవీణ్ తొగాడియా విషయాన్ని చర్చించరాదని మరో వర్గం తీర్మానం చేసింది. ఈ సమావేశంలో ప్రవీణ్ తొగాడియా కూడా పాల్గొననున్నారు.
మరోవైపు ప్రవీణ్ తొగాడియా ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ మిత్రపక్షం శివసేన డిమాండ్ చేసింది. ఆయన చేసిన ఆరోపణలపై దేశ ప్రజలకు ప్రధాని మోడీ, అమిత్ షాలు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని శివసేన అభిప్రాయపడింది.