సంచలనం: విహెచ్పికి తొగాడియా గుడ్బై, ఏమైందంటే?
న్యూఢిల్లీ: విహెచ్పి నుండి ఆ సంస్థ మాజీ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా బయటకు వచ్చారు. మూడు దశాబ్దాలకు పైగా విహెచ్పి (విశ్వ హిందూ పరిషత్) లో ప్రవీణ్ తొగాడియా కీలక పదవులను నిర్వహించారు. అయితే అంతర్జాతీయ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రవీణ్ తొగాడియా తాను నామినేట్ చేసిన రాఘవరెడ్డి ఓటమి పాలు కావడంతో సంస్థ నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకొన్నారు. మంగళవారం నుండి ఆయన ఆమరణ నిరహార దీక్షకు దిగనున్నట్టు ప్రకటించారు.
విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్ష పదవితో పాటు పలు కీలకమైన పదవులను నిర్వహించిన ప్రవీణ్ తొగాడియా ఆ సంస్థ నుండి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. విహెచ్పి కీలక నేతగా ఉన్న ప్రవీణ్ తొగాడియా ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
తొగాడియా 2011 నుంచి వీహెచ్పీకి ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. వీహెచ్పీ కొత్త ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా హిమాచల్ప్రదేశ్ మాజీ గవర్నర్ వీఎస్ కోక్జె ఎన్నికయ్యారు.
ఆయనకు 131 ఓట్లు రాగా, ప్రస్తుత అధ్యక్షుడు రాఘవరెడ్డికి 60 ఓట్లు దక్కాయి. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత ఈ పదవికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తొగాడియా ఆరోపించారు. వీహెచ్పీ నుంచి వైదొలిగినా హిందువుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.ప్రవీణ్ తొగాడియా ఇటీవల కాలంలో ప్రధానమంత్రి మోడీకి వ్యతిరేకంగా విమర్శలు చేశారు.
ఆమరణ నిరహారదీక్షకు దిగనున్న ప్రవీణ్ తొగాడియా
విహెచ్పి మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా హిందూత్వ అంశాన్ని తీసుకొని ఏప్రిల్ 17 నుండి ఆమరణ నిరహారదీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. మంగళవారం నుండి హిందూత్వ అంశానికి సంబంధించి పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆమరణ నిరహరదీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. హిందూత్వ అంశానికి సంబందించి తాను ఉద్యమాన్ని చేస్తూనే ఉంటానని చెప్పారు.