రామాలయం-యోగి ఆదిత్యనాథ్.. ఇదీ విషయం!: టార్గెట్ మోడీ, తొగాడియా పుస్తకంతో చుక్కలు!!
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ లీడర్ ప్రవీణ్ తొగాడియా ఇష్యూ కలకలం రేపుతోంది. తనను ఎన్కౌంటర్లో చంపేయడానికి ప్రయత్నాలు చేశారని, తన నోరు మూయించేందుకు సెంట్రల్ ఏజెన్సీలను మోహరించాలని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఇలా చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు.
అయితే ఆయన రాబోయే పుస్తకంలో అయోధ్యలోని రామ జన్మభూమి, గోవధ అంశాలపై ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉంటాయని తెలిసి, బీజేపీయే ఆయన నోరు నొక్కుతుందా అనే చర్చ సాగుతోంది. విపక్ష కాంగ్రెస్ నేతలు, పటేల్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ కూడా అవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పుస్తకం చిచ్చు, మోడీ ప్రతిష్ట దెబ్బతీసేలా
రామ జన్మభూమి ఉద్యమం, గోవధ నిషేధ చట్టం వంటి అంశాలను తాను లేవనెత్తడం కొందరికి గిట్టకపోవడం వల్లే తనపై కుట్ర జరుగుతోందని తొగాడియా ఆరోపించారు. తొగాడియా అరెస్టుకు రాజస్థాన్ పోలీసులు పదేళ్ల క్రితం నాటి కేసు సాకుతో రావడం వెనుక చాలా తతంగమే ఉందని అంటున్నారు. అయోధ్యలో రామమందిరం గురించి తొగాడియా రాసిన ఒక పుస్తకం తుదిమెరుగుల దశలో ఉండగా, ఈ పుస్తకం ప్రధాని మోడీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉండటంవల్లే ఆయనపై పాత కేసును తిరగదోడారని తొగాడియా సన్నిహితుడు ఒకరు వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయని అంటున్నారు.
ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది?
తొగాడియా ఆరోపణల నేపథ్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో హిందుత్వ అజెండాతో ముందుకు వెళ్లి, మరో అయిదేళ్లు అధికారంలో ఉండాలనుకుంటున్న బీజేపీ ఆశలపై నీళ్లు జల్లేలా తొగాడియా పుస్తకంలో ఉందా అనే చర్చ సాగుతోంది. వస్తున్న కథనాల మేరకు.. తొగాడియా అనుచరుడి కథనం ప్రకారం.. 'శాఫ్రాన్ రిఫ్లక్షన్స్: ఫేసెస్ అండ్ మాస్క్స్' అనే టైటిల్తో తొగాడియా పుస్తకం రాశారు. రామజన్మభూమి ఉద్యమం, బీజేపీపై దాని ప్రభావం అనేది ఈ పుస్తకంలో ప్రస్తావించారని తెలుస్తోంది. ఈ ఉద్యమానికి కృషి చేసిన హిందుత్వ నేతలు, దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకున్న నేతల ప్రస్తావన కూడా చోటుచేసుకుంది. మరెన్నో అంశాలు ఇందులో ఉన్నాయని తెలుస్తోంది.
ప్రచురణ జరిగితే
2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు తొగాడియా పుస్తకం ప్రచురణ జరిగితే రామాలయం అంశాన్ని ఎన్నికల అజెండాలో చేర్చడం ద్వారా మరో అయిదేళ్లు అధికారంలోకి రావాలన్న బీజేపీ ప్రయత్నాలకు ఈ పుస్తకంలోని అంశాలు ముప్పుగా పరిణమించే అవకాశాలు లేకపోలేదని తొగాడియా అనుచరుడు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
మోడీ-రామాలయం, గోవధ
'ప్రధాని కావడానికి హిందువుల మద్దతు పొందిన మోడీ ఆ తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ఏమీ చేయకుండానే ఏ విధంగా వారిని వంచించాడనే విషయాన్ని తొగాడియా తన పుస్తకంలో వివరించార'ని ఈ పుస్తకాన్ని చదివిన ఆయన అనుచరుడు వివరించినట్లుగా తెలుస్తోంది. దేశంలో సంపూర్ణ గోవధ నిషేధాన్ని అమల్లోకి తెచ్చే విషయంలోనూ మోడీ విఫలమయ్యారని ఆ పుస్తకంలో విమర్శలు గుప్పించారని, పుస్తకం దాదాపు పూర్తికావచ్చిందని తెలిపారు.
ఆదిత్యనాథ్ అందుకే
పుస్తక ప్రచురణకు ముందు తొగాడియా దానికి తుది మెరుగులు ఇస్తున్నారని ఆ అనుచరుడు చెప్పారని తెలుస్తోంది. అయోధ్య అంశం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ఎజెండా కానుంది. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ను ఎంపిక చేయడం ద్వారా ఆ దిశగా ఇప్పటికే పావులు కదిపారని, ఆదిత్యనాథ్ సైతం రామాలయం అంశాన్ని మరోసారి పార్టీకి అనుకూలంగా మార్చే పనిలో ఉన్నారని, భారత ఆర్థిక వ్యవస్థ మందగమన పరిస్థితిలో ఉండటం కూడా రామాలయం అంశాన్ని చేపట్టేందుకు బలమైన మరో కారణంగా చెబుతున్నారని, ఈ దశలో మరో అయిదేళ్లు అధికారంలోకి రావాలంటే అయోధ్య అంశం కీలకం కాబోతుందని అంటున్నారు.
మోడీ పేరు చెప్పకపోయినా
మోడీతో తొగాడియాకు సత్సంబంధాలు లేవని అంటున్నారు. ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పుందని తొగాడియా బహిరంగంగా చెప్పడంతో ఈ సంబంధాలు మరింత ముదురుపాకాన పడినట్లేనని, మోడీ పేరును తొగాడియా నేరుగా ప్రస్తావించనప్పటికీ ఆయన పైనే తన పుస్తకంలో ప్రధానంగా విరుచుకుపడినట్టు తొగాడియా సన్నిహితుడి సమాచారం బట్టి తెలుస్తోందని అంటున్నారు.