పాకిస్థానీవా అయితే నీకు నో ఎంట్రీ! ప్రయాగ్రాజ్లో హోటల్ నిర్ణయం!
ప్రయాగ్రాజ్ : నిరసన తెలపడంలో ఒక్కొక్కరిది ఒక్కో రీతి. కొందరు మాటలకే పరిమితం అయితే మరికొందరు చేతల్లో చూపిస్తారు. సరిహద్దుల్లో పేట్రేగుతున్న పాక్ చర్యలపై చాలా మంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారత జవాన్లతో పాటు కాశ్మీరీ పౌరుల ప్రాణాలు బలిగొంటున్న పాక్పై మండిపడుతున్నారు. అయితే ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఓ హోటల్ పాక్ తీరును నిరసిస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
జోస్యం చెప్పినందుకు జాబ్ పోయింది!
పాకిస్థానీలకు ప్రవేశం లేదు
ప్రయాగ్రాజ్లోని హోటల్ మిలన్ ప్యాలెస్ పాకిస్థానీలను తమ హోటల్లో అడుగుపెట్టనీయమని ప్రకటించింది. సివిల్ లైన్స్, లీడర్ రోడ్లలో ఉన్న తమ రెండు హోటళ్లలో పాక్ పౌరలకు ప్రవేశం నిషిద్ధమని యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు హోటల్ ఎంట్రెన్స్లోనే నోటీసు పెట్టింది. ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న పాకిస్థాన్ తీరుకు నిరసనగానే ఈ నిర్ణయమని స్పష్టం చేసింది.
మంత్రులు దృష్టి ఆకర్షించేందుకే
పాకిస్థానీ నాట్ అలౌడ్ అంటూ హోటల్ మిలన్ ప్యాలెస్ నోటీసులు అంటించడం వెనుక రాజకీయ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం హోటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. వారి దృష్టిని ఆకర్షించేందుకే నోటీసు పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే హోటల్ మిలన్ ప్యాలెస్లో ఒక మాజీ ప్రజాప్రతినిధికి భాగస్వామ్యం ఉన్నదని ఆయన ఒత్తిడి మేరకే యాజమాన్యం పాకిస్థానీలను అనుమతించమని నోటీస్ పెట్టినట్లు సమాచారం.
హోటల్ తీరుపై విమర్శలు
ఇదిలాఉంటే ప్రయాగ్రాజ్లో పాక్ పౌరులకు అనుమతిలేదన్న హోటల్ యాజమాన్యం తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆ నోటీసును చూసి నవ్వుకుంటుండగా... మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఉగ్రవాదులు చేసిన పనికి పాక్ పౌరులందరినీ నిందించడం, వారిని హోటల్లో అడుగు పెట్టనీయకుండా అడ్డుకోవడం సరికాదని అంటున్నారు.