45 రోజుల ఆధ్యాత్మిక వేడుక... కుంభమేళాకు క్యూ కట్టిన భక్తులు
ఉత్తర ప్రదేశ్ : అర్ధకుంభమేళా మహాక్రతువు మొదలయింది. భక్తుల రాకతో త్రివేణి సంగమం పులకించిపోతోంది. సంక్రాంతి పండుగ నాడు ప్రారంభమయ్యే ఈ కుంభమేళా మార్చి 4వ తేదీ వరకు కొనసాగుతుంది. మంగళవారం తెల్లవారుజామున రాజయోగ స్నానాలతో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు.
కుంభమేళా సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు పెద్దసంఖ్యలో మోహరించారు. సుమారు 20వేల మంది పోలీసులు విధుల్లో నిమగ్నమయినట్లు తెలుస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. ఐదు కిలోమీటర్ల పరిధిలో 30కి పైగా స్నానఘట్టాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఈ యేడాది జరుగుతున్న కుంభమేళాకు ఓ ప్రత్యేకత ఉంది. సరస్వతి కూప్ తో పాటు అక్షయ్ వాత్ దగ్గర పూజలు చేసుకునే విధంగా భక్తులకు తొలిసారిగా అవకాశం కల్పించడం విశేషం. 450 ఏళ్ల నుంచి జరుగుతున్న కుంభమేళాలో ఇలాంటి అవకాశం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 12 నుంచి 15 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వచ్చే ఛాన్సుందని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఈ సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. పెద్దసంఖ్యలో భక్తులు తరలిరానుండటంతో.. లక్ష వరకు బయో పోర్టబుల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.