రాహుల్ ప్రకటించిన ఆ పథకం సాధ్యం కాదు....అది ఎన్నికల స్టంట్ మాత్రమే: జైట్లీ
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన కనీస ఆదాయం హామీ ఒక బూటకపు హామీ అని అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పిన కాంగ్రెస్ పై జైట్లీ నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు ఏడాదికి సగటున రూ.1,06800 ఖర్చు చేస్తుండగా కాంగ్రెస్ చెబుతున్నట్లుగా నెలకు ఇచ్చే రూ.12 వేలు ఏడాదికి రూ.72వేలు అవుతుందని అది మోడీ సర్కార్ ఖర్చు చేస్తున్న దానికంటే చాలా చాలా తక్కువని అన్నారు.
కాంగ్రెస్కు షాక్:అగస్టావెస్ట్లాండ్ కేసులో అప్రూవర్గా రాజీవ్ సక్సేనా
బీజేపీ ఖర్చు చేస్తున్నదానికంటే చాలా తక్కువ
ఇక పలు సంక్షేమ పథకాలతో పాటు ఆహారం, ఎరువులు, ఆయుష్మాన్ భారత్ రైతులకు ఇస్తున్న సబ్బడీల కోసం ఏడాదికి రూ. 5.34 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నట్లుగా రూ.72వేలను సరిగ్గా లెక్కవేస్తే అది ఐదు కోట్ల కుటుంబాలకు చేరితే రూ.3.6 లక్షల కోట్లు మాత్రమే అవుతుందని అది ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న దానికంటే చాలా తక్కువని లెక్కగట్టారు. అంతేకాదు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలనే పేరు మార్చి కాంగ్రెస్ తీసుకొస్తామని చెబుతోందని అన్నారు.
వనరులు లేకుండా హామీలు ఎలా నెరవేరుస్తారు..?
కాంగ్రెస్ వాదనలు ఎప్పుడూ తప్పే అవుతాయని చెప్పిన జైట్లీ ఒక్కసారి చరిత్ర చూస్తే తెలుస్తుందన్నారు. పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కర్నాటకల్లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్... అక్కడ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాక తమకు రుణమాఫీ జరగలేదని ఆ రాష్ట్రాల్లోని రైతులు చెబుతున్నారని జైట్లీ అన్నారు. హామీలు నెరవేర్చాలంటే వనరులు ఉండాలని అవేమీ లేకుండానే కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇప్పటి వరకు కర్నాటకలో రూ.2600 కోట్లు, మధ్యప్రదేశ్లో రూ.300 కోట్లు, పంజాబ్లో రూ.5500 కోట్లు మాఫీ చేస్తామని చెబుతున్నాయని అవన్నీ బూటకపు మాటలే అని జైట్లీ ధ్వజమెత్తారు. ఇక మోడీ ప్రభుత్వంలో రూ.5.34 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్లిందని చెప్పారు. అంతకుముందు మరో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ గత 55 ఏళ్లుగా పేదలను పట్టించుకోని కాంగ్రెస్... ఇప్పుడు ప్రజలను మళ్లీ తప్పుడు హామీలతో మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు.
నాడు ఇందిరా గరీబీ హఠాఓ నినాదం ఇచ్చారు..ఏమైంది..?
"రాహుల్ గాంధీ ఈరోజు కనీస ఆదాయ పథకంను ప్రకటించారు. ఇందిరా గాంధీ నాడు 1971లో గరీబీ హఠాఓ నినాదం ఇచ్చారు. అయితే పేదరికం దేశం నుంచి పారద్రోలారని అంతా అనుకున్నారు. కానీ ఏమీ జరగలేదు. ఆ తర్వాత రాజీవ్ గాంధీనే స్వయంగా చెప్పారు. ఢిల్లీ నుంచి తాను ఒక రూపాయి పంపిస్తే అది రాష్ట్రాలకు చేరేసరికి 15 పైసలుగానే ఉంటుందన్నారు" అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. జనవరిలో కనీస ఆదాయం పథకం గురించి రాహుల్ ప్రస్తావించారు. అయితే రాహుల్ చెప్పిన పథకం వర్కౌట్ కాదని ఆర్థికంగా అది సాధ్యపడదని నీతిఆయోగ్ తెలిపింది. ఇదిలా ఉంటే కనీస ఆదాయ పథకం పేరు "న్యాయ్" అని ఉంటుందని రాహుల్ అన్నారు. అంటే న్యూన్తం ఆయ్ యోజన లేదా కనీస ఆదాయ పథకంగా దీనికి పేరు పెడుతున్నట్లు రాహుల్ ప్రకటించారు. అయితే ఇది దశలవారీగా అమలు చేస్తామని వెల్లడించారు.
మొత్తానికి ప్రజలను ప్రసన్నం చేసుకుని హామీలపై హామీలు ఇస్తున్న నేతలు నిజంగానే ఇవి అమలు చేయగలుగుతారా... అందుకు ఆర్థిక వనరులు ఏ మేరకు సహకరిస్తాయి...ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందనేది నాయకులు ఆలోచిస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.