ప్రధానికి అంటుకున్న ముందస్తు బెడద..!! తెలంగాణ పరిస్థితులే కేంద్రంలో కూడా నెలకొంటాయా..?
హైదరాబాద్/ ఢిల్లీ : తెలంగాణతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఏదో తెలియని జంకు ఆయా రాజకీయ నేతలు వేధిస్తోంది. వాస్తవ పరిస్థితులకు విరుద్దంగా వీరు ఆలోచిస్తున్నారా..? అతి అభద్రతా భావంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా.. ? అదికారం కోల్పోతే ప్రాణాలు కోల్పోయేంతటి అపోహ వీళ్ల మెదళ్లను తొలుస్తోందా..? కారణం ఏదైనప్పటికి ఏదో తెలయని భయంతో కేంద్రంలోని పెద్దలు కూడా ఉలిక్కిపడుతున్నారు. రాజకీయంగా ఏదో జరిగిపోంతోంది, ఏదో విపత్తు ముంచుకొస్తోంది..దాన్ని నిలువరించేందుకు ఏదో చేయాలి. ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ అదికారం చేజిక్కించుకోవడమే సకల సమస్యలకూ పరిష్కారం అనే దిశగా ఆలోచిస్తూ అనర్థాలను కొని తెచ్చుకుంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అచ్చు తెలంగాణ ప్రభుత్వం ఆలోచించినట్టే కేంద్రం కూడా ఆలోచిస్తున్నట్టు తాజ పరిణామాలు రుజువుచేస్తున్నాయి.
ముందస్తు పదం కేంద్రంలో ఎందుకు వినిపిస్తోంది..! మోదీ భయపడేది ఎవరికి..?
మాటిమాటికీ ముందస్తు పదం కేంద్రంలో ఎందుకు వినిపిస్తోంది. మోడీ ఎవరికి భయపడుతున్నాడు? దేశంలో ఏం జరగబోతోంది? ఇవన్నీ ఇపుడు రాజకీయ విశ్లేషకులకు ఎదురవుతున్న ప్రశ్నలు. సాంకేతికంగా జనవరి నుంచి ఎప్పుడైనా, అంటే నిర్దేశిత కాలానికి ఆరునెలల ముందు దేశంలోని లోక్సభతో పాటు ఏపీ వంటి రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిపే రాజ్యాంగబద్ధ అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంటుంది. 2019 జూన్ నెల మొదటివారానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాలవ్యవధి ఉన్నా కూడా జనవరిలో ఎన్నికలు జరపడానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఇంతకీ ఎందుకు బీజేపీ ముందస్తుపై ఇంత ఉబలాట పడుతోందంటే సమాధానం మాత్రం లోతుగా వినిపిస్తోంది.
రాఫెల్ కుంభకోణంలో ఊహించని మలుపు..! మోదీకి వ్యతిరేక సాక్ష్యం..!
దేశంలో భారతీయ జనతా పార్టీకి పరిస్థితులు బాగా లేవు. దీనిని అధిష్టానం గుర్తించింది. రాఫెల్ కుంభకోణం ఊహించని మలుపుతిరిగి, అంతర్జాతీయంగా మోడీకి వ్యతిరేక సాక్ష్యం తెరమీదకు వచ్చింది. దీంతో రోజురోజుకీ రాఫెల్ వివాదం ముదిరిపోతోంది. ఇది మరో బోఫోర్స్ కుంభకోణం కాంగ్రెస్కు చేసిన నష్టం కంటే, రాఫెల్ బీజేపీకి చేసే నష్టం చాలా ఎక్కువగా పరిణమించబోతోందంటున్నారు విశ్లేషకలు. ఎందుకంటే అంబానీలకు మేలు చేసేందుకు మోడీ ప్రభుత్వం ఎంతో ఉదాసీనంగా వ్యవహరించిందన్న విషయాన్ని సామాన్యులు అంత తేలికగా తీసుకోరు. పేద, మధ్యతరగతి ప్రజలకు రిలయన్స్ సామ్రాజ్యం పేరు పైన ఉన్న అపనమ్మకమే ఇందుకు కారణం. రాజకీయనాయకులు, కార్పొరేట్ సంస్థలు ఒక్కటై, ప్రజల డబ్బును దోచుకుంటున్నారని ఆలోచన సామాన్య ప్రజారికం మెదళ్లలోకి వస్తే దాని ప్రతిచర్య ఘోరంగా ఉంటుందని చెప్పకనే చెప్పొచ్చు.
హార్డ్ కోర్ బీజేపీ ఫ్యాన్స్ కూడా కాంగ్రెస్ బెటర్ అనే పరిస్థితికి కారణం ఎవరు..?
వాటికి తోడు, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత నగర వాసులలో బీజేపీ పట్ల వ్యతిరేకత బాగా పెరిగింది. హార్డ్ కోర్ బీజేపీ ఫ్యాన్స్ కూడా కాంగ్రెస్సే మేలనే పరిస్థితికి వచ్చునట్టు తెలుస్తోంది. నగర, పట్టణ జనాభాలో సగానికి పైగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారే ఉంటారు. మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయం వారిని ప్రత్యక్ష్యంగా ప్రతికూలంగా ప్రభావితం చేసింది. ప్రధానిగా నరేంద్ర మోదీ నిర్ణయాల ప్రభావం వీరిపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి నగర ఓటర్ల పై తేరుకోలేని దెబ్బ తీసాయి. ఫుట్పాత్ వ్యాపారులు జీఎస్టీ కారణంగా రోడ్డున పడ్డారు. దీనికి తోడు పెట్రోలు ధరల పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యింది. ఈ కారణాలన్నీ నివురుగప్పిన నిప్పులా కనిపిస్తున్నప్పటికి ఎన్నికల్లో మాత్రం దహించి వేకయక మానదనే వాదనలు వినిపిస్తున్నాయి.
జనం మోదీకి ఓట్లు వేసిందే అవినీతి అంతానికి..! ప్రస్తుతం దానికి విరుద్ధంగా ఉన్న పరిస్థితి..!
ఇవన్నీ కలిస్తే ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయిపోతాయి. రాజీవ్ గాంధీ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి బోఫోర్స్ ప్రధాన కారణంగా నిలిచింది. నిజానికి ఈ కుంభకోణంతో సామాన్యులకు వచ్చిన నష్టమేమీ లేదు. కానీ అవినీతి చోటు చేసుకుందన్న సంగతిని వారు జీర్నించుకోలేకపోయారు. అసలు జనం మోదీకి ఓట్లు వేసిందే అవినీతి అంతానికి అయితే, దానికి విరుద్ధంగా ఉన్న పరిస్థితిని అస్సలు సహించరు. అందుకే, దేశంలో పరిస్థితి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీని భయాందోళనకు గురి చేస్తోంది. దాంతో లోక్ సభను రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలనే యోచన పెద్ద ఎత్తున సాగుతోందని ఢిల్లీ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే తెలంగాణ ముందస్తు పరిణామాలకు, కేంద్రంలోని మోదీ కి సంక్రమిస్తున్న పరిస్థితులకు పెద్ద తేడా ఉండదనే వార్తలు వినిపించే అవకాశాలు లేకపోలేదు.