బీజేపీ దెబ్బకు దెబ్బ: బొంబాయి ప్రతీకారం రాంచీలో..వాట్ నెక్ట్స్ ?
జార్ఖండ్: జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఇంకా వస్తున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్-జేఎంఎంల కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యను క్రాస్ చేశాయి. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ ఏమైనా పావులు కదుపుతుందా అనే అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి రంగం సిద్ధం చేస్తుండగా... సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ పావులు కదిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ముందస్తు పొత్తులా సింగిల్ లార్జెస్ట్ పార్టీనా..?
మహారాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాక దాదాపు నెల రోజుల పాటు పొలిటికల్ హైడ్రామా నడిచింది. ఆ సమయంలో గవర్నర్ కీలక పాత్ర పోషించారు. అప్పటి వరకు బీజేపీతో ఉన్న శివసేన ఒక్కసారిగా కమలం పార్టీకి షాక్ ఇచ్చింది. దీంతో అక్కడ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. క్యాంపు రాజకీయాలు తెరపైకొచ్చాయి. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్ము కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానిస్తారా అనేది సస్పెన్స్గా మారింది.
ప్రభుత్వ ఏర్పాటుకు కూటమినే ఆహ్వానించాలంటున్న కాంగ్రెస్
ఇదిలా ఉంటే ఎన్నికల కంటే ముందు తాము పొత్తు పెట్టుకున్నామని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తమ కూటమినే ఆహ్వానించాలని కాంగ్రెస్ చెబుతోంది. అంతేకాదు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమవద్ద కావాల్సిన బలం ఉందని మూడు పార్టీలకు సంబంధించిన లేఖలతో గవర్నర్ను కూటమి నేతలు కలిసే అవకాశం ఉంది. గవర్నర్ ఆహ్వానం కంటే ముందు జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీలు లేఖలు తీసుకెళ్లి గవర్నర్ను కలిసే అవకాశం ఉంది.
జార్ఖండ్ కథ ఆసక్తికరంగా మారుతుందా..?
సాధారణంగా ముందస్తు పొత్తుకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం గవర్నర్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన మహారాష్ట్రను బీజేపీ కోల్పోయి.. హర్యానాలో మరో పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ... జార్ఖండ్లో ఏమైనా పావులు కదిపితే కథ ఇంట్రెస్టింగ్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు సింగిల్ లార్జెస్ట్ పార్టీకే అవకాశం ఇవ్వాలని కోరుతూ బీజేపీ ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చి చిన్నా చితకా పార్టీల మద్దతుతో గోవాలో ఇంప్లిమెంట్ చేసిన ఎపిసోడ్ను జార్ఖండ్లో కూడా అమలు చేస్తుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదే జరిగితే ముంబై ఎపిసోడ్కు జార్ఖండ్ ద్వారా బీజేపీ ప్రతీకారం తీర్చుకున్నట్లే అవుతుంది.