అంబులెన్స్ ఉన్నా..వెళ్లే దారి లేక: ప్రసవం కోసం అయిదు కిలోమీటర్లు మంచంపై గర్భిణీ!
భువనేశ్వర్: ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ఎదుర్కొంటున్న అత్యంత దైన్య స్థితికి అద్దం పట్టే ఉదంతం ఇది. అంబులెన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అది వెళ్లే దారి లేదు. వాహన రాకపోకలకు అనువుగా లేని కారణంగా.. ఏజెన్సీలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఓ గర్భిణీని మంచంపై సుమారు అయిదు కిలోమీటర్ల దూరం పాటు మోసుకుంటూ వెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. రోడ్డు సౌకర్యం ఉన్న చోట నిలిచివున్న అంబులెన్స్ ను చేరుకోవడానికి వారు ఆ గర్భిణీని అయిదు కిలోమీటర్ల దూరం వరకు మోసుకెళ్లారు. ఆ సమయంలో ఆమె పడ్డ పురిటి నొప్పులు వర్ణనాతీతం. ఈ ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో చోటు చేసుకుంది.
దీపావళి ఎఫెక్ట్: మళ్లీ సరి-బేసి విధానం: వచ్చేనెల నుంచి అమలు: ట్రాఫిక్ పోలీసులకు మరిన్ని కష్టాలు?
ఆ గర్భిణీ పేరు హర్సోమణి బిషోయ్. కోరాపుట్ జిల్లాలోని దశ్మంత్ పూర్ బ్లాక్ పరిధిలో మారుమూల గ్రామం కలియంబోలో తన భర్త ఉమాకాంత బిషోయ్ తో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు ఆరంభం అయ్యాయి. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. కలియంబో వరకూ వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేదు. కాలి నడక మార్గం కూడా అంతంత మాత్రమే. పైగా కోరాపుట్ జిల్లాలో విస్తారంగా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల ఉన్న మట్టి రోడ్డు కాస్త బురదమయమైంది. ఫలితంగా- కలియంబో గ్రామానికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న డుంబగూడ వరకు వచ్చిన అంబులెన్స్ అక్కడే ఆగిపోయింది.
దీనితో ఉమాకాంత్, ఇతర కుటుంబ సభ్యులు ఆ గర్భిణీని మంచంపై కూర్చోబెట్టుకుని మోసుకుంటూ డుంబగూడ వరకు వెళ్లారు. అక్కడి నుంచి ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు వెలుగులోకి వచ్చిన వెంటనే కోరాపుట్ జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని జిల్లా వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు సౌకర్యాన్ని కల్పించడానికి గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. రోడ్డు వేయడానికి అనువైన పరిస్థితులు ఉంటే.. యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు.