బాణాసంచాను కూర్చిన పండ్లను ఏనుగుకు తినిపించిన కిరాతకులు: పోస్ట్మార్టమ్ రిపోర్ట్లో
తిరువనంతపురం: కేరళలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. గర్భంతో ఉన్న ఓ ఏనుగును అతి కిరాతంగా హత్య చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. పండ్లలో బాణాసంచా పెట్టి ఏనుగుకు తినిపించారు. ఏనుగు దాన్ని తినే సమయంలో నిప్పింటించారు. బాణాసంచా పేలడంతో ఏనుగు తీవ్రంగా గాయపడింది. నరక యాతన అనుభవిస్తూ మూడు రోజుల తరువాత కన్నుమూసింది. ఈ ఘటన పట్ల కేరళ వ్యాప్తంగా జంతు ప్రేమికులు, పర్యావరణ సంరక్షకులు నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video
ఏనుగుల అందాల పోటీల్లో అపశ్రుతి.. ఓ ఏనుగు రచ్చ.. 18 మందికి గాయాలు..! (వీడియో)
అటవీ అధికారి పోస్ట్తో వెలుగులో..
మళప్పురం జిల్లా వెన్నియార్లో కిందటి నెల 27వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. మోహన్ కృష్ణన్ అనే అటవీ అధికారి.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏనుగు మరణించే సమయానికి అది గర్భంతో ఉన్నట్లు పోస్ట్మార్టమ్ చేసిన డాక్టర్లు తెలిపారు. నిర్జీవంగా ఉన్న పిండాన్ని బయటికి తీయాల్సి వచ్చిందని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు ట్విట్టరెటీలను కన్నీళ్లు పెట్టించింది.
పండ్లల్లో బాణాసంచా కూర్చి..
ఆకలితో ఉన్న 15 సంవత్సరాల ఏనుగు మళప్పురం జిల్లాలోని ఓ గ్రామంలో ఆహారం కోసం ప్రవేశించింది. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు ఆ ఏనుగుకు పైనాపిల్ సహా కొన్ని పండ్లను అందించారు. అందులో బాణాసంచాను కూర్చారు. వాటిని తింటోన్న సమయంలో నిప్పింటించారు. పెద్ద శబ్దం చేస్తూ పటాసులు పేలిపోయాయి. ఏనుగుకు తొండానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆహారాన్ని తీసుకోలేని స్థితికి చేరుకుంది. తొండం నుంచి రక్తమోడుతుండటంతో పాటు ఈగలు ముసురుకోవడంతో వాటి బారి నుంచి కాపాడుకోవడానికి ఆ ఏనుగు వెల్లియార్ నదిలో నిల్చుంది.
మూడురోజుల పాటు నదిలో కదలకుండా..
మూడురోజుల పాటు ఏనుగు కదలకుండా నిల్చోవడాన్ని గమనించిన మోహన్ కృష్ణన్ అటవీశాఖ సిబ్బంది సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఈ ఏనుగును జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. వైద్యాన్ని అందించారు. ఏనుగు ప్రాణాలను నిలపడానికి కొన్ని గంటలపాటు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కిందటి నెల 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఏనుగు మరణించింది. ఈ ఘటనపై మోహన్ కృష్ణన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
పోస్ట్మార్టమ్లో
ఏనుగు కళేబరానికి నిర్వహించిన పోస్ట్మార్టమ్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చింది. మరణించే సమయానికి ఏనుగు గర్భంతో ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రాణంలేని పిండాన్ని దాని కడుపు నుంచి బయటికి తీశారు. బాణాసంచా పేలుడు వల్ల దాని నాలుక మొత్తం ధ్వంసమైందని అన్నారు. సంఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి ఘన ఆహారాన్ని తీసుకోలేదని తేల్చారు. ఏనుగు కడుపులో ఘన పదార్థాలేవీ లభించలేదని చెప్పారు. మూడురోజుల పాటు నదిలో నిల్చునే ఉండటం వల్ల అది నీళ్లను తాగి జీవించినట్లు అంచనా వేస్తున్నామని అన్నారు. రక్తమోడుతున్న తొండంపై ఈగలు ముసురుకోకుండా ఉండటానికి నదిలో నిల్చోవడం వల్ల ఏనుగు ఊపిరి తిత్తుల్లో నీళ్లు చేరినట్లు గుర్తించారు.