యోగీ కోటలో డబ్బు లేదని గర్బిణిని అర్దరాత్రి ఆసుపత్రి నుంచి గెంటేశారు, ఆటోలో మగ బిడ్డకు !
లక్నో: ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. నిండు గర్బిణిని అర్దరాత్రి ఆసుపత్రి నుంచి బయటకు గెంటివేయడంతో ఆటో రిక్షాలో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అర్దరాత్రి సమయంలో నిండు గర్బిణి దగ్గర డబ్బు లేదని తెలిసిన వెంటనే కనీసం కనికరం లేకుండా ఆసుపత్రి సిబ్బంది మృగాలుగా మారిపోయారు.
ఉత్తరప్రదేశ్ లోని శహరణపూర్ ప్రాంతంలో మున్వర్ అనే వ్యక్తి కూలి పని చేసుకుంటున్నాడు. ఇతని భార్య నిండు గర్బణి. ఈనెల 14వ తేది అర్దరాత్రి మున్వర్ భార్యకు పురుటి నొప్పులు రావడంతో ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆసుపత్రిలో భార్యను చేర్పించడానికి అతని దగ్గర అంత డబ్బు లేకపోయింది.
తన భార్యను ఆసుపత్రిలో చేర్పించుకోవాలని, మరుసటి రోజు డబ్బు చెల్లిస్తానని మున్వర్ మనవి చేశాడు. మున్వర్ భార్యను ఆసుపత్రిలో చేర్పించుకోవడానికి సిబ్బంది నిరాకరించారు. తనకు పురుటి నొప్పులు ఎక్కువగా ఉన్నాయని దయచేసి ఆసుపత్రిలో ఉంటానని మున్వర్ భార్య మనవి చేసింది.
ఆసుపత్రి సిబ్బంది మాత్రం డబ్బులు ఇస్తేనే ఇక్కడ ఉండండి లేదంటే బయటకు పోవాలని హెచ్చరించారు. చివరికి మున్వర్, అతని భార్యను ఆసుపత్రి నుంచి బయటకు గెంటేశారు. మరో ఆసుపత్రిలో చేర్పించడానికి మున్వర్ తన భార్యను ఆటోలో తీసుకుని బయలుదేరాడు.
మార్గం మధ్యలోనే మున్వర్ భార్య ఆటోలో మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే భార్య, బిడ్డను శహరణపూర్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించాడు. తన భార్యను అర్దరాత్రి బయట గెంటేసిన ఆసుపత్రి సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని మున్వర్ ఫిర్యాదు చేశాడని, విచారణ జరుగుతోందని శహరణపూర్ జిల్లా గ్రామీణ ఎస్పీ విద్యాసాగర్ మెహ్రా అన్నారు.