8 ఆస్పత్రుల నిరాకరణ, 13గంటలు అంబులెన్స్లోనే నరకం.. చివరకు గర్భిణీ బలి
లక్నో: ఆస్పత్రి యాజమాన్యాల నిర్లక్షానికి ఓ నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నొప్పులు రావడంతో అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆమె కుటుంబసభ్యులు. అయితే, ఆస్పత్రి యాజమాన్యాలు ఆమెను అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించాయి. ఒకటి కాదు రెండు కాదు అరడజనుకుపైగా ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. 13 గంటలపాటు అంబులెన్స్లోనే నరకయాతన అనుభవించిన ఆ మహిళ చివరకు ప్రాణాలు వదిలింది.
13 గంటలు అంబులెన్స్లోనే నరకం..
వివరాల్లోకి వెళితే.. గౌతమ్బుద్ధనగర్ జిల్లాలోని కోడా కాలనీలో నివాసముంటున్న విజేందర్ సింగ్, నీలమ్ భార్యాభర్తలు. ఎనిమిది నెలల గర్భిణి అయిన నీలమ్(30)కు అనుకోకుండా నొప్పులు రావడంతో ఆమెను భర్త విజేందర్ సింగ్ అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మొదట ఒక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సరిపడా బెడ్స్ లేవని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అలా మొత్తం 13 గంటలపాటు 8 ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. నీలమ్ నొప్పులు తాళలేక అంబులెన్స్లోనే మరణించింది.
కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. భర్త ఆవేదన
భార్య నీలమ్ మరణంతో భర్త విజేందర్ సింగ్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. మొదట తాము ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్లామని, అక్కడ నిరాకరించడంతో సెక్టార్ 30లోని చైల్డ్ పీజీఐ ఆస్పత్రికి, అక్కడ్నుంచి షర్దా, జిమ్స్(గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్)లకు వెళ్లామని.. అయితే వారంతా ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు నిరాకరించారని తెలిపాడు విజేందర్. ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రులైన జేయ్పీ, ఫోర్టీస్, మ్యాక్స్ ఇన్ వైశాలికి వెళ్లామని వారూ నిరాకరించారని తెలిపాడు. ఇలా 13 గంటలు అంబులెన్స్లోనే తిరిగామని చెప్పాడు.
Recommended Video
భర్త వీడియో వైరల్.. ఘటనపై విచారణకు ఆదేశం..
చివరకు జిమ్స్ ఆస్పత్రిలో చేర్పించామని.. అప్పటికే నీలమ్ ప్రాణాలు కోల్పోయిందని కన్నీటిపర్యంతమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చూసినవారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ ఎల్వై విచారణకు ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి ఘటనే ఈ జిల్లాలో చోటు చేసుకుంది. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో మే 25న పుట్టిన శిశువు మరణించాడు.