ఈ పాపం ఎవరిది: గర్భిణీ స్త్రీకి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన వైద్యులు...బిడ్డ పరిస్థితి ఏమిటి..?
రక్త పరీక్ష సందర్భంగా చేసిన పొరపాటుకు నిండు జీవితం బలైంది. ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో ఓ నిండు గర్భిణీకి హెచ్ఐవీ సోకింది. దీంతో ఆమె ప్రాణం ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్లో జరిగిన ఉదంతం కాదు. ఒక ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటన. ఇక వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విధురనగర్ జిల్లాలో ఓ నిండు గర్భిణీ డెలివరీ కోసం వచ్చింది. డెలివరీ సందర్భంగా ఆమెకు రక్తం లేకపోవడంతో రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించారు. ఇక్కడే ఆ పొరపాటు జరిగింది. హెచ్ఐవీ సోకిన వ్యక్తి తాలూకు రక్తాన్ని గర్భిణీకి ఎక్కించి ఆమె బతుకుతో ఆటలాడుకున్నారు.
హెచ్ఐవీ టెస్టు చేయని టెక్నీషియన్లు
రెండేళ్ల క్రితం ఓ ఎన్జీఓ సంస్థ నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఓ వ్యక్తి తన రక్తాన్ని దానం చేశాడు. అయితే ఆ వ్యక్తికి హెచ్ఐవీ సోకినట్లు అప్పటికే ఆ బ్లడ్ బ్యాంక్ అధికారులు నిర్ధారించారు. అయితే ఆ బ్లడ్ బ్యాంక్ అధికారులు రక్తం మాత్రం దాత దగ్గరనుంచి తీసుకున్నారు కానీ ఆవ్యక్తికి హెచ్ఐవీ ఉన్నట్లు అతనికి తెలపలేదు. ఇక ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన ఈ వ్యక్తి మరోసారి రక్తం దానం చేశాడు. డిసెంబర్ 3వ తేదీన ఈ వ్యక్తి నుంచి సేకరించిన రక్తాన్ని గర్భిణీ స్త్రీకి ఎక్కించారు. అయితే రక్తం ఎక్కించేముందు రక్త పరీక్ష చేసిన ల్యాబ్ టెక్నీషియన్లు బ్లడ్ గ్రూప్ సరిపోలిందని చెబుతూ నివేదిక ఇవ్వడంతో ఆ రక్తాన్ని వైద్యులు గర్భిణీ స్త్రీకి ఎక్కించారు.
మరోసారి బ్లడ్ టెస్టు చేయించుకోగా బయటపడ్డ ఎయిడ్స్ విషయం
ఇక కొన్ని రోజుల తర్వాత రక్తం దానం చేసిన వ్యక్తి ఉద్యోగ నిమిత్తమై బ్లడ్ టెస్టు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డిసెంబర్ 17న రక్త పరీక్ష చేసుకోగా తనకు హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి గర్భిణీ స్త్రీకి రక్తం దానం చేశాడన్న విషయం గుర్తుకొచ్చి ప్రభుత్వాస్పత్రికి పరుగులు తీశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ మహిళకు వైద్యులు రక్తం అప్పటికే ఎక్కించేశారు. తొందరగా గుర్తించడం వల్ల చికిత్స చేసి ఆమె మరింత కాలం బతికేందుకు ఆస్కారం ఉందని వైద్యులు తెలిపారు. అయితే పట్టబోయే బిడ్డకు హెచ్ఐవీ సోకిందా లేదా అనేది తెలియాలంటే బిడ్డ పుట్టే వరకు ఆగాలని వైద్యులు తెలిపారు.
రక్తదానం చేసిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం
రక్త పరీక్ష చేసిన టెక్నీషియన్ హెచ్ఐవీ టెస్టు చేయలేదని వైద్యులు తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందికాదని, యాదృచికంగా జరిగి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు తమిళనాడు హెల్త్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఆర్ మనోహరన్ చెప్పారు. జరిగిన ఘటనపై పోలీసులు ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఆ మహిళకు తను రక్తం దానం చేసి ఆమె జీవితం నాశనం చేశానని చెబుతూ రక్త దానం చేసిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎలుకల మందు తిని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒకరి జీవితం నాశనం చేసిన తాను బతికేందుకు ఇష్టం లేదని చెబుతున్నాడని వైద్యులు చెప్పారు.