coronavirus: 8 నెలల గర్భవతి.. భర్తతో కలిసి 100 కి.మీ కాలినడకన పయనం, అన్నం పెట్టి, అంబులెన్స్లో..
దారుణం, అన్యాయం.. అవును ఆ నిరుపేద దంపతుల పాలిట కరోనా వైరస్ శాపంగా మారింది. వారికి వైరస్ సోకలేదు. దేశంలో వైరస్ ప్రబలుతుండటంతో ప్రధాని మోడీ 3 వారాలపాటు లాక్డౌన్ విధించారు. దీంతో కంపెనీలు మూతపడిపోయాయి. పొట్ట చేత పట్టుకొని ఉన్న ఊరిని, బంధువులను వదిలి రాజధాని నగరం చేరిన కూలీలు.. తిరిగి స్వస్థలాలకు వెళ్లాల్సి వస్తోంది. ఉన్న చోట పని లేక, గూడు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు కొన్ని కంపెనీలు ఇచ్చే జీతం ఇవ్వకుండా.. ఇచ్చిన గదిని ఖాళీ చేయాలని కఠినంగా ప్రవర్తిస్తున్నాయి. దీంతో ఓ జంట 100 కిలోమీటర్లు తిండి లేక, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోన్న హృదయ విదారకర ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది.
నేపథ్యం ఇదీ..
యూపీలోని బులంద్ సహర్ అమర్ ఘడ్కి చెందిన దంపతులు. వారిద్దరూ పొట్ట చేత పట్టుకొని ఢిల్లీ వచ్చారు. అక్కడే గల కంపెనీలో భర్త పనిచేస్తుండగా.. భార్య కూడా చిన్న చితక పనులు చేసేది. అయితే కరోనా వైరస్ విపత్తు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం వారి జీవితాలను కబలించింది. పని లేకున్నా ఫరవాలేదు.. కాలం వెళ్లదీయొచ్చు అనుకునే సమయానికికి.. వారికి ఇచ్చిన గదిని కూడా ఖాళీ చేయాలని యాజమాని హుకుం జారీచేశాడు. అయితే వారికి ఇవ్వాల్సిన నగదు మాత్రం ఇవ్వలేడు. అసలే ఓనర్, ఎదరించి అడగలేని పరిస్థితి.
కాలినడకన 100 కి.మీ
ఏం చేయలేని పరిస్థితి వారిది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏ చేయాలని ఆలోచించారు. కనీసం ఉన్న కొద్దిపాటీ డబ్బుతో సొంతూరికి వెళదామనుకుంటే.. బస్సులు నడవడం లేదు. దీంతో వారు గుండే ధైర్యం చేసుకొని.. తమ సొంత గ్రామానికి బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. వంద కిలోమీటర్లు పైగా ఉన్న సొంతూరికి కాలినడకన బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. అయితే వివాహిత 8 నెలల గర్భవతి కావడం ప్రతీ ఒక్కరిని కదిలించింది. అలా తమ గమ్య స్థానం కోసం భార్యభర్తలు ఇద్దరూ నడుచుకుంటూ వెళుతున్నారు.
స్థానికుల రూపంలో..
వారి మొరను దేవుడు ఆలకించడమో ఏమో కానీ.. షహరన్ పూర్ బస్టాండ్ వద్ద స్థానికులు చూశారు. నవీన్ కుమార్, రవీంద్ర అనే యువకులు వారిని ఆపి సమస్య తెలుసుకున్నారు. వెంటనే విషయాన్ని పోలీసులకు కూడా తెలియజేశారు. స్థానికుల సహాకారంతో పోలీసులు నగదు జమ చేశారు. ఈలోపు వారు రెండురోజుల నుంచి ఆహారం తీసుకోనందున.. అన్నం కూడా పెట్టించారు. అంబులెన్స్ పిలిపించి వారి స్వస్థలానికి పంపించారు.
Recommended Video
మరవం.. మీ సాయం...
తమ పట్ల స్థానికులు, పోలీసులు చూపిన ఔదర్యంపై దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. వారికి తాము రుణపడి ఉంటామని చెబుతున్నారు. పని చేయించుకున్న కంపెనీ చేయని సాయం.. వారు చేశారని కళ్ల నుంచి ఊబికి వస్తోన్న నీటిని ఆపుకొని మరీ తమ భావాన్ని వ్యక్తపరిచారు.