ఇవెక్కడి సర్కార్ ఆస్పత్రులు రా బాబూ..! చికిత్సకని వెళితే గర్భవతికి ఆ రక్తం ఎక్కించారు
తమిళనాడులో ఓ వ్యక్తి తాను పుట్టిన సమయంలో వైద్యులు హెచ్ఐవీ ఉన్న రక్తం ఎక్కించిన సంగతి తెలిసిందే. సీన్ కట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత నాడు బాలుడుగా ఉన్న వ్యక్తికి రూ. 50 లక్షలు పరిహారం చెల్లించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలంటూ చెన్నై కోర్టు తీర్పు చెప్పింది. తాజాగా వైద్యుల నిర్లక్ష్యంతో మరో మహిళకు కూడా ఇదే పరిస్థితి తలెత్తింది.
తమిళనాడు రాష్ట్రం సత్తూరుకు చెందిన 24 ఏళ్ల గర్భవతి చికిత్స కోసం శివకాశిలోని ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్లింది. డిసెంబర్ 3, 2018న హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ఎక్కించారు ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన వైద్యులు. అప్పటి వరకు ఈ విషయం వెలుగులోకి రాలేదు. ఎప్పుడైతే ఆమెకు రక్తం ఇచ్చిన 19 ఏళ్ల వ్యక్తి తనకు ఎయిడ్స్ ఉందని, తాను కొద్దిరోజుల క్రితం రక్తం దానం చేశానని హాస్పిటల్ వైద్యుల దృష్టికి తీసుకొచ్చాడు. తనకు హెచ్ఐవీ సోకిందన్న విషయం ఆలస్యంగా తెలిసిందని పేర్కొన్నాడు. అయితే అప్పటికే హెచ్ఐవీ సోకిన రక్తంను గర్భవతి అయిన మహిళకు ఎక్కించడం జరిగిపోయింది. ఈ విషయం తెలిసిన ఆ యువకుడు విషం తీసుకుని డిసెంబర్ 25న మృతి చెందాడు.
ఇక ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ మహిళను మదురైలోని రాజాజీ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు జనవరి 17న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డకు హెచ్ఐవీ సోకలేదని వైద్యులు పరీక్షలు చేసి నిర్థారించారు. ఇక ఈ మహిళకు న్యాయం చేయాల్సిందిగా కోర్టు తలుపులు తట్టారు మదురైకి చెందిన సామాజిక కార్యకర్తలు అప్పసామి, ముత్తుకుమార్. మహిళకు న్యాయం చేయాలంటూ ప్రజా ప్రయోజనవాజ్యంను దాఖలు చేశారు. కేసును విచారణ చేసిన మద్రాసు హైకోర్టు మహిళకు వెంటనే రూ.25 లక్షలు, 450 చదరపు అడుగులు ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లును ఇవ్వాల్సిందిగా తీర్పు వెలువరించింది.