పెళ్లాడమంటే.. ప్రియురాలిని రైలు కింద తోసేశాడు
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దా రైల్వే స్టేషన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోమందని ఒత్తిడి చేయడంతో ఓ యువకుడు గర్భవతి అయిన తన ప్రియురాలును కర్కశంగా రైలు కింద తోసేశాడు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు.
మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రైల్వే పోలీసులు, అధికారులు మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. కతిహార్ ఎక్స్ప్రెస్ మంగళవారం మధ్యాహ్నం మాల్దా నుంచి శంసీ స్టేషన్కు వెళ్తొంది. ఈ సమయంలో అక్కడున్నవారికి ఓ మహిళ ఆర్తనాదం వినిపించింది. దీంతో రైల్వే పోలీసు అధికారులు అక్కడికి వెళ్లి చూడగా ఓ మహిళ రైల్వే పట్టాలపై రక్తపు మడుగులోపడి ఉంది.
వెంటనే ఆమెను దగ్గరున్న మాల్దా మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ ఘటనలో బాధితురాలు కుడి చేయి కోల్పోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి కుటుంబసభ్యులు నిందితుడైన అహిమ్ మండల్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేయించారు.
తమ కుమార్తె అహిమ్తో ప్రేమలో ఉందని, ప్రస్తుతం ఆమె గర్భవతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వారి ప్రేమ విషయం తెలిసి పెళ్లి చేసుకోమని అడిగితే అహిమ్ మొదట తిరస్కరించాడని, డిసెంబరు 16న తాము అతనిపై కేసు పెట్టడంతో పెళ్లికి సమ్మతించాడని అన్నారు. అయితే, తమ కుమార్తెను చంపాలనే ఉద్దేశం అతడికి ఉందని ఊంహించలేదని వాపోయారు.
కాగా, మంగళవారం అహిమ్ ఇంటికి వచ్చి తమ కుమార్తెను 'బయటకు వెళ్దాం' రమ్మని పిలిచినట్లు బాధితురాలి తల్లి తెలిపింది. ఆమెను బయటికి తీసుకెళ్తున్నాడు.. అనుకున్నామే కానీ, ఇలా రైలు కింద తోసేస్తాడనుకోలేదని చెప్పింది. తమ కూతురు మరణానికి కారణమైన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కోరారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. అహిమ్ మరో కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడని చెప్పారు.