ప్రీతి కేసు: వాడియా ఫ్యామిలీకి మరో 4 బెదిరింపు కాల్స్
ముంబై: బాలీవుడ్ నటి ప్రీతి జింతా వేధింపుల కేసులో తమకు గ్యాంగ్స్టర్ రవి పుజారి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ప్రీతి జింతా మాజీ ప్రియుడు నెస్ వాడియా కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ నాలుగు సార్లు అదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని వాడియా కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రీతిపై వేధింపులకు పాల్పడవద్దంటూ వారు బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. నుల్సి వాడియా కార్యాలయం ముంబై క్రైం బ్రాంచ్ యాంటీ ఎక్ట్సోర్షన్ సెల్కి ఫిర్యాదు చేసింది. శుక్రవారం తమ కార్యాలయంలోని ఫోన్కు కాల్ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తొలిసారి బెదిరింపులు వచ్చిన నెంబర్ కావడంతో ఆ కాల్ను ఎవరూ లిఫ్ట్ చేయలేదని వాడియా వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.
బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో వాడియా కుటుంబానికి తగిన భద్రతా చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ రాకేష్ మరియా తెలిపారు. వారి ఇంటి వద్ద, కార్యాలయం వద్ద ఇద్దరిద్దరు సాయుధ పోలీసులను కాపాలాగా ఉంచామని చెప్పారు. ఈ ఫోన్ కాల్స్ ఇరాన్ నుంచి వచ్చినట్లు మరియా బుధవారం చెప్పిన విషయం తెలిసిందే. మళ్లీ ఎందుకు ఫోన్ కాల్స్ చేస్తున్నారో, వాడియా కుటుంబానికి సంబంధించిన ఫోన్ నెంబర్లు వారికి ఎలా లభిస్తున్నాయనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని మరియా తెలిపారు.
ఛోటా రాజన్ గ్యాంగ్తో విడిపోయిన రవి పుజారిపై 12కు పైగా కేసులు ఇప్పటికే నమోదయ్యాయయని ఆయన చెప్పారు. ఇందులో అత్యధికంగా బలవంతపు వసూళ్లకు సంబంధించినవేనని మరియా తెలిపారు. పుజారి ఆస్ట్రేలియాలో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, ప్రీతి జింతా తనపై నెస్ వాడియా వేధింపులకు పాల్పడ్డాడని ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు కొనసాగుతోందని మెరైన్ డ్రైవ్ పోలీసులు తెలిపారు.