మాజీ ప్రియుడు వాడియాపై జింతా ఫొటో సాక్ష్యాలు
ముంబై: తన మాజీ ప్రియుడు నెస్ వాడియా తనపై దాడి చేశాడనే ఆరోపణను సమర్థించుకోవడానికి బాలీవుడ్ నటి ప్రీతీ జింతా తన చేతికి అయిన గాయాలకు సంబంధించిన నాలుగు ఫొటోలను పోలీసులకు అందించారు. సాక్షుల పేర్లను కొన్నింటిని నెస్ వాడియా పోలీసులకు అందించిన నేపథ్యంలో ప్రీతీ జింతా ఈ ఫొటోలను పోలీసులకు అందించారు.
జింతా అందించిన ఫొటోలను పరిశీలిస్తున్నామని, అవి కీలకమైన సాక్ష్యాలు కాగలవని కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు అంటున్నారు. జులై 2వ తేదీ నెస్ వాడియా ఇచ్చిన తొమ్మిది మంది సాక్షుల పేర్లలో కొంత మందిని సంప్రదించామని దర్యాప్తు అధికారి ఒకరు చెప్పారు.
వాడియా సెరీకా లాల్, లోరెట్టా జోసెఫ్, పూజా దద్లానీ, అన్నీలైన్ ఆడమ్స్, ఫర్హా ఊమెర్భాయ్, స్వీటీ బర్మన్, కమలేష్ షా, రయాన్ ముస్తాఫా, శరత్ నాథ్ పేర్లను పోలీసులకు చెప్పారు. జూన్ 12వ తేదీన నెస్ వాడియా తనపై అసభ్యంగా ప్రవర్తించాడని, బెదిరించాడని ప్రీతి జింతా ఫిర్యాదు చేశారు.
జింతా ఆరోపణలను నెస్ వాడియా ఖండించారు. తన చేతిని లాగి, నెట్టి తనను నెస్ వాడియా తిట్టాడని జింతా ఆరోపించారు. తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి జింతా ఫొటోలను పోలీసులకు ఇచ్చారు.