సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం .. మార్చి 6 న కేంద్ర క్యాబినెట్ చివరి సమావేశం
Recommended Video
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు దాదాపు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 7 నుంచి 10వ తేదీలోగా ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. జూన్ 3వ తేదీన 16వ లోక్సభ పదవీ కాలం ముగియనుండడంతో ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది కేంద్ర ఎన్నికల కమీషన్.
పార్లమెంటుతో పాటు మరో నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు
ఒక పార్లమెంట్ ఎన్నికలే కాకుండా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జూన్ 18న పదవీకాలం ముగియనుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి జూన్ 1న, సిక్కిం రాష్ట్రానికి మే 27న, ఒడిస్సా రాష్ట్రానికి జూన్ 11న పదవీకాలం ముగియనుంది. దీంతో లోక్సభతో పాటు ఈ నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఇక రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్కు కూడా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటున్న కేంద్ర ఎన్నికల సంఘం
ఇప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 22.3 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 16.3 లక్షల కంట్రోల్ యూనిట్లు, 17.3 లక్షల వీవీప్యాట్ యంత్రాలు అవసరమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏ మేరకు యంత్రాంగం సిద్ధంగా ఉందో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారో లేదో పరిశీలించారు. ఇప్పటికే ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి, ఓటర్ల జాబితా ఫైనల్ చేయడానికి అన్ని రాష్ట్రాలు కసరత్తులు ముమ్మరం చేశాయి. తెలంగాణ రాష్ట్రం పార్లమెంటు ఎన్నికలకు తుది ఓటర్ల జాబితాను సైతం ప్రకటించింది.
మార్చి 6న కేంద్ర కేబినెట్ చివరి సమావేశం .. మార్చి 7 నుండి 10 లోపు ఎన్నికల షెడ్యూల్
దీంతో మార్చి 6వ తేదీన కేంద్ర కేబినెట్ చివరి సమావేశం ఉండే అవకాశం ఉంది. అదే రోజున కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28 లోగా ఎన్నికలకు సంబంధించిన బాధ్యులుగా ఉండే అధికారుల బదిలీలను పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి యుద్ధ ప్రాతిపదికన సార్వత్రిక ఎన్నికల కసరత్తు నిర్వహిస్తోంది. వచ్చే నెలలో మార్చి 7 నుండి 10వ తేదీలోపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది కేంద్ర ఎన్నికల కమీషన్.