షాకింగ్ : యాంటీబాడీస్తో నో గ్యారెంటీ... కరోనాపై సంచలన విషయాలు చెప్పిన సైంటిస్టులు...
భారత్లో కరోనా కేసుల సంఖ్య 43 లక్షలు దాటింది. ఓవైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా... మరోవైపు రికవరీ రేటు కూడా బాగానే ఉంది. అయితే వ్యాధి నుంచి కోలుకున్నవారిలో కొంతమంది రీఇన్ఫెక్షన్ బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి శరీరంలో ఒకసారి యాంటీబాడీస్ అభివృద్ది చెందితే కొన్ని నెలల పాటు ఉంటాయి. అయితే యాంటీబాడీస్ ఉన్నంత మాత్రాన రోగం తిరగబెట్టకుండా ఉంటుందా... యాంటీబాడీస్ ఉన్న వ్యక్తి అనారోగ్యం బారిన పడకుండా ఉంటాడా...? అంటే దానికి గ్యారెంటీ ఏమీ లేదంటున్నారు సైంటిస్టులు.
రెండు రకాల యాంటీబాడీస్...
సాధారణంగా ఓ వ్యక్తిలో అప్పటికే యాంటీబాడీస్ ఉన్నాయంటే... అతను కరోనా బారినపడినట్లుగా పరిగణిస్తున్నారు. అయితే శరీరంలో యాంటీబాడీస్ ఉన్నప్పటికీ... వైరస్ వృద్ది గురించి దాని ద్వారా ఏమీ తెలియదని న్యూఢిల్లీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ సైంటిస్ట్ ఒకరు చెప్పారు. యాంటీబాడీస్లో న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్(nAbs),సింపుల్ యాంటీబాడీస్ అని రెండు రకాలు ఉంటాయంటున్నారు. వీటిల్లో న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ శరీరంలోని హెస్ట్ సెల్లోకి కరోనా వైరస్ ఎంట్రీని నిరోధిస్తాయని పుణే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్,ఎడ్యుకేషన్&రీసెర్చ్(IISER)కి చెందిన ఇమ్యునాలజిస్ట్ వినీతా బల్ తెలిపారు.
యాంటీబాడీస్... గ్యారెంటీ ఉన్నట్లేనా...
ఒకవేళ శరీరంలో సింపుల్ యాంటీబాడీస్ ఉన్నట్లయితే... వైరస్ ఉనికికి అవి సంకేతమని... అయితే వైరస్ వ్యాప్తిని అవి అడ్డుకోలేవని వినీతా బల్ చెప్పారు. కాబట్టి శరీరంలో యాంటీబాడీస్ వృద్ది చెందినంత మాత్రాన కరోనా నుంచి అవి కాపాడుతాయన్న గ్యారెంటీ లేదన్నారు. అయితే న్యూట్రలైజ్ యాంటీబాడీస్ తగినంత సాంద్రతలో వృద్ది చెంది... ఎక్కువ కాలం పాటు ఉండగలిగితే కొంతమేరకు ఫలితం ఉండవచ్చునన్నారు. కరోనా కారణంగా ఆ వ్యక్తి అనారోగ్యం బారినపడకుండా న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ రక్షణగా నిలుస్తాయన్నారు. అయితే న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ శరీరంలో ఏ స్థాయిలో ఉంటే కరోనాను అవి ప్రభావవంతంగా ఎదుర్కొంటాయని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
సర్వేల్లో తేడాలు....
దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో సెరో సర్వేల (రక్త నమూనాల్లో కోవిడ్-19 యాంటీబాడీస్ టెస్ట్) ద్వారా కరోనా ప్రభావాన్ని అంచనా వేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రక్త నమూనాల పరిశీలన ద్వారా జనాభాలో ఎంతమంది కరోనా బారినపడి ఉంటారని అంచనా వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రతీ నలుగురిలో ఒకరు కరోనా బారినపడినట్లు సెరో సర్వేలు వెల్లడించాయి. అయితే ఈ సర్వేలన్నీ ఒకే నమూనాను ఫాలో అవట్లేదని సైంటిస్టులు చెబుతున్నారు.
యాంటీబాడీస్పై మరిన్ని పరిశోధనలు అవసరం...
చాలావరకు సెరో సర్వేల్లో కరోనా పాజిటివ్,నెగటివ్ అంశాలను ప్రస్తావిస్తున్నారు తప్పితే యాంటీబాడీస్ గురించి ఎక్కడా విశ్లేషించట్లేదని ఇమ్యునాలజిస్ట్ వినీతా బల్ అన్నారు. రోగి శరీరంలో ఏ స్థాయిలో యాంటీబాడీస్ వృద్ది చెందాయో సర్వేలు వెల్లడించట్లేదని అన్నారు. కొంతమంది కరోనా రోగులు రీఇన్ఫెక్షన్ బారినపడుతున్నారని... అయితే ఎవరి శరీరంలో అయితే న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ వృద్ది చెందుతాయో.... వారు కరోనా నుంచి రక్షించబడుతారని ఇటీవల క్లినికల్ మైక్రోబయాలజీ జర్నల్లో పేర్కొనట్లు చెప్పారు. ఒకసారి యాంటీబాడీస్ డెవలప్ అయితే దాదాపు 4 నెలల పాటు ఉంటాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అయితే యాంటీబాడీస్ వృద్ది,వాటి పనితీరు గురించి స్పష్టత రావాలంటే మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.