మహా సంక్షోభం: ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం: మహారాష్ట్రీయుడికే అదనపు బాధ్యతలు..!
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేన లోక్ సభ సభ్యుడు అరవింద్ గణపత్ సావంత్ కేంద్రమంత్రిగా తన పదవికి చేసిన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ మంగళవారం ఉదయం ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. శివసేనతో భారతీయ జనతాపార్టీ కుదుర్చుకున్న పొత్తులో భాగంగా అరవింద్ సావంత్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కిన విషయం తెలిసిందే. ఆయనకు భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ మంత్రిత్వ శాఖను కేటాయించారు.
మహారాష్ట్రలో ఒక్కటే: మాలెగావ్ లో మజ్లిస్ లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో..!
రాజీనామా చేయడానికి.. ఎన్డీఏ నుంచి వైదొలగడానికీ..
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంలో శివసేన, బీజేపీ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఫలితంగా బీజేపీ నేతృత్వం వహిస్తోన్న ఎన్డీఏ కూటమి నుంచి శివసేన వైదొలగాల్సి రావడంతో అరవింద్ సావంత్ రాజీనామా చేశారు. కేంద్రంలో కొనసాగాలనే ఆలోచన తనకు ఏ మాత్రం లేదని ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. తనకు పార్టీ ముఖ్యమే తప్ప పదవులు కాదని, మహారాష్ట్రలో శివసేన సారథ్యంలోొ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు జరిగితే అందరి కంటే ఎక్కువగా సంతోషించే వాళ్లల్లో తాను ఉంటానని చెప్పుకొచ్చారు.
మరాఠీయుడికే అదనపు బాధ్యతలు..
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగాలని శివసేన నిర్ణయించుకోవడం, ఆ మరుక్షణమే కేంద్ర మంత్రివర్గం నుంచి ఏకైక లోక్ సభ సభ్యుడు అరవింద్ సావంత్ వైదొలగడం.. వంటి పరిణామాలు శరవేగంగా చోటు చేసుకున్నాయి. అరవింద్ సావంత్ రాజీనామా వల్ల ఖాళీ అయిన భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ మంత్రిత్వ శాఖను ప్రకాష్ జవదేకర్ కు అప్పగించారు. ప్రకాశ్ జవదేకర్ కూడా మహారాష్ట్రకు చెందిన నాయకుడే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర మంత్రివర్గంలో మహారాష్ట్ర కోటాను భర్తీ చేయడంలో భాగంగా ప్రకాశ్ జవదేకర్ కు ఆ మంత్రిత్వ శాఖను కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకాశ్ జవదేకర్ పర్యావరణ, అటవీ, సమాచార, ప్రసారాల మంత్రిగా ఉన్నారు. అదనంగా భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖను ఆయన పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ పగ్గాలు దక్కక పోయినా..
మహారాష్ట్ర పరిణామాలపై ప్రస్తుతం బీజేపీ వ్యూహాత్మ క మౌనాన్ని అనుసరిస్తోంది. వరుసగా రెండోసారి అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశం చేతికి అందినప్పటికీ.. శివసేన ప్రతిపాదించిన 50-50 ఫార్ములా వల్ల దాన్ని చేజార్చుకున్నట్టయింది. శివసేన తెగే దాకా లాగుతుందని ఊహించని బీజేపీ నాయకులు ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నారు. శివసేన-కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్సీపీ) సారథ్యంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ.. అస్థిర పరిచే అవకాశాలు రాకపోవని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక తరహాలో ఆపరేషన్ కమలను చేపట్టి, అధికార మార్పిడి చేయొచ్చనే అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి.