ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్, అధికారికంగా నియమించిన రాష్ట్రపతి, ఆదివారం ప్రమాణం
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ను భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించారు. ఈ నెల 8న ఢిల్లీ పోలింగ్ జరగగా.. 11వ తేదీన ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లతో జయకేతనం ఎగరేశారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంతోపాటు అసెంబ్లీని కలిగి ఉంది. కేంద్రపాలిత ప్రాంతం కావడంతో ముఖ్యమంత్రిని రాష్ట్రపతి అపాయింట్ చేశారు.
శుక్రవారం సాయంత్రి రాష్ట్రపతి భవన్లో రామ్నాథ్ కోవింద్ను మనీష్ సిసోడియాతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. పుష్పగుచ్చం అందజేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ను నియమిస్తున్నట్టు ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రకటించారు.
కానీ కేజ్రీవాల్ మాత్రం ఆదివారం ఉదయం రామ్ లీలా మైదానంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దర్యాగంజ్ ప్రాంతంలో గల గ్రౌండ్లో కేజ్రీవాల్ సహా ఆరుగురు కేంద్రమంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్ మంత్రులుగా ప్రమాణం చేస్తారు.
మూడోసారి ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సారి బీజేపీ సీట్లు పెరిగాయే తప్ప.. ప్రభావం చూపలేదు. 2015లో 3 సీట్ల నుంచి 2020 వరకు 8 సీట్లకు చేరుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సహా మిగతా పార్టీలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం విశేషం. 67 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోవడం చూస్తే.. ఆప్ హవా ఎలా ఉందో అర్థమవుతోంది.