16వ లోక్సభ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ : 16వ లోక్ సభను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రద్దుచేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీంతో కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి కొలువుదీరనుంది. వచ్చేవారం మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉంది.
క్యాబినెట్ సిఫారసు .. రాష్ట్రపతి ఓకే
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన మంత్రివర్గం శుక్రవారం సమావేంది. ఈ భేటీలో మంత్రివర్గాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫారసు చేశారు. దీనికి ఇవాళ ఉదయం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మరోవైపు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సీఈసీ సునీల్ అరోరా. కమిషనర్లు అశోక్ లవాసా, సుశీల్ చంద్ర సమావేశమయ్యారు. లోక్ సభకు ఎన్నికైన అభ్యర్థుల జాబితాను అందజేశారు. దేశంలో మొత్తం 543 స్థానాలు ఉండగా .. వెల్లూరు లోక్ సభ ఎన్నిక ధనప్రవాహంతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో 542 మంది ఎంపీల వివరాలను ఈసీ రాష్ట్రపతికి అందజేసింది.
ఆపద్ధర్మ ప్రధానిగా
మోదీ మరోసారి పగ్గాలు చేపట్టేవరకు ఆయనే ఆపద్దర్మ ప్రధానిగా కొనసాగుతారు. వచ్చేవారంలో మోదీ ప్రమాణ స్వీకారం ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే క్యాబినెట్ కూర్పుపై కూడా మోదీ తన సన్నిహితులతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈసారి క్యాబినెట్ లోకి .. బీజేపీ చాణక్యుడు అమిత్ షాను తీసుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతుంది. మిగతా మంత్రులను పనితీరు, సామాజిక సమీకరణాలు, తదితర అంశాల ఆధారంగా తీసుకుంటారు. ఇదివరకు కొనసాగిన నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ క్యాబినెట్ లో బెర్త్ ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. అమేథీలో రాహుల్ ను మట్టికరిపించిన స్మృతి ఇరానీకి కూడా క్యాబినెట్ లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.
క్యాబినెట్ బెర్త్
ఇక తెలంగాణలో బీజేపీ 4 సీట్లు గెలవడంతో ఎవరికీ పదవీకి దక్కుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, కిషన్ రెడ్డిలో ఒకరికి కేంద్ర సహాయ మంత్రి పదవీ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరిలో బండి సంజయ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఎవరికీ పదవీ దక్కుతుందనే అంశం తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.