పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం- కేంద్రంపై ప్రశంసలు-స్ధిర, నిర్మాణాత్మక ప్రభుత్వమంటూ..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. సమావేశాల ఆరంభం రోజు ఆనవాయితీగా వస్తున్న రాష్ట్రపతి ప్రసంగం కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఇందులో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాల్ని రాష్ట్రపతి ముర్ము ప్రస్తావించారు
ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..2047 నాటికి గతకాలపు గర్వంతో అనుసంధానించిన ఆధునికత యొక్క అన్ని బంగారు అధ్యాయాలను కలిగి ఉన్న దేశాన్ని మనం నిర్మించాలని పిలుపునిచ్చారు. భారతదేశం 'ఆత్మనిర్భర్', దాని మానవతా బాధ్యతలను నెరవేర్చగల సామర్థ్యం కలిగి ఉంటుందని ముర్ము తెలిపారు. అది పేదరికం లేని భారతదేశం కావాలని, ఇందులో మధ్య తరగతి కూడా సంపన్నంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. సమాజానికి, దేశానికి మార్గాన్ని చూపడానికి యువత, మహిళలు ముందు నిలబడే భారతదేశం కావాలని ఆమె ఆకాంక్షించారు.
ఇవాళ దేశం యొక్క ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయికి చేరుకుందని, ప్రపంచం మన దేశాన్ని భిన్నమైన కోణంలో చూస్తోందని రాష్ట్రపతి వెల్లడించారు. భారతదేశం ప్రపంచానికి పరిష్కారాలను అందిస్తోందన్నారు. స్థిరమైన, నిర్భయ, నిర్ణయాత్మక ప్రభుత్వం దేశంలో ఉందన్నారు. దేశంలో పెద్ద కలలను సాకారం చేసుకునే దిశగా కృషి చేస్తున్నామని ద్రౌపది ముర్ము తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం నుంచి ట్రిపుల్ తలాక్ రద్దు వరకు తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి అన్నారు. అవినీతి అంతానికి సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయానికి అవినీతి అతిపెద్ద శత్రువు అని ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయంతో ఉందన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా గత సంవత్సరాలుగా నిరంతర పోరాటం కొనసాగుతోందన్నారు. జల్ జీవన్ మిషన్ కింద మూడేళ్లలో సుమారు 11 కోట్ల కుటుంబాలకు పైపుల ద్వారా నీటి సరఫరా అందించామన్నారు. పేద కుటుంబాలు దీని నుండి గరిష్ట ప్రయోజనం పొందుతున్నాయన్నారు.గత వందేళ్లలో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు స్థిరమైన , నిర్ణయాత్మక ప్రభుత్వం తగు నిర్ణయాలు తీసుకుందని రాష్ట్రపతి వెల్లడించారు. ప్రపంచంలో రాజకీయాలు అన్ని చోట్ల ఉన్నాయని, కానీ ఇతర దేశాలు వాటి కారణంగా సంక్షోభంలో చిక్కుకున్నాయని, కానీ మన ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందన్నారు. గతంలో పన్ను రిటర్న్ కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చేదని, ఇవాళ ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే వాపసు లభిస్తోందన్నారు. కేంద్రం ఎటువంటి వివక్ష లేకుండా సమాజంలోని ప్రతి వర్గానికి పని చేసిందన్నారు. కేంద్రం కృషి ఫలితంగా గత కొన్నేళ్లలో ప్రభుత్వం అనేక ప్రాథమిక సౌకర్యాల్ని 100% జనాభాకు చేర్చిందన్నారు.
పూర్తి పారదర్శకతతో కోట్లాది మందికి రూ.27 లక్షల కోట్లకు పైగా విలువైన పథకాలు అందాయని రాష్ట్రపతి తెలిపారు. అలాంటి పథకాలు, వ్యవస్థలతో భారతదేశం కోవిడ్ సమయంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కోట్లాది మంది ప్రజలను రక్షించగలిగిందని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొందన్నారు. గరీబీ హఠావో కేవలం నినాదం మాత్రమే కాదని, పేదల సమస్యలకు శాశ్వత పరిష్కారం, వారికి సాధికారత కల్పించేందుకు కేంద్రం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల ఆకాంక్షల్ని పూర్తి చేసిందన్నారు. ఇప్పుడు వారికి ప్రాథమిక సౌకర్యాలు లభిస్తున్నాయని, ఈ ప్రజలు కొత్త కలలను చూడగలుగుతున్నారన్నారు.
దేశంలోని 500 బ్లాకుల్లో వైబ్రెంట్ జిల్లాల కార్యక్రమం అమలవుతోందని రాష్ట్రపతి తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలను అభివృద్ధి చేయడానికి 'వైబ్రెంట్ గ్రామాలు' కార్యక్రమం కూడా ప్రవేశపెట్టామన్నారు. కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా పేదలకు జీవించడం ఎలా కష్టతరంగా మారిందో చూశామని, కానీ భారత్ లో మాత్రం పేదల జీవితాలను రక్షించడంతోపాటు దేశంలోని పేదలు ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రపోకుండా చూసేందుకు కేంద్రం ప్రయత్నించిందన్నారు.
మారిన పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను పొడిగించాలని నిర్ణయించినందుకు సంతోషంగా ఉందని రాష్ట్రపతి తెలిపారు. ఇది సున్నితమైన, పేదల అనుకూల ప్రభుత్వానికి గుర్తింపు అన్నారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలలో మహిళా సాధికారత ప్రధానమైందని రాష్ట్రపతి తెలిపారు. ఈ రోజు మనం 'బేటీ బచావో, బేటీ పఢావో' విజయాన్ని చూస్తున్నామని, దేశంలో మొట్టమొదటిసారిగా పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువైందని, మహిళల ఆరోగ్యం కూడా మునుపటి కంటే మెరుగుపడిందని తెలిపారు.